అక్షరటుడే, వెబ్డెస్క్: Karnataka Footpath Policy | ప్రజలకు ఫుట్పాత్లపై స్వేచ్ఛగా నడిచే హక్కు కల్పించేందుకు కర్ణాటక ప్రభుత్వం కొత్త ఫుట్పాత్ విధానాన్ని తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రకటించారు. ఫుట్పాత్లపై అక్రమ ఆక్రమణలు, వ్యాపార కార్యకలాపాలు, వాహనాల పార్కింగ్ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
ప్రభుత్వం భారీ వ్యయంతో నిర్మించిన ఫుట్పాత్లు పాదచారుల కోసం ఉద్దేశించినవేనని, అయితే ప్రస్తుతం వాటిపై వ్యాపారాలు, వాహనాల పార్కింగ్ పెరగడంతో ప్రజలు రోడ్లపై నడవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. చిరు వ్యాపారుల కోసం ప్రత్యేక ప్రాంతాలను గుర్తించి, ఫుట్పాత్లను పూర్తిగా పాదచారుల వినియోగానికి అందుబాటులో ఉంచేలా కొత్త విధానాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు.
Karnataka Footpath Policy | తమ పార్టీ నాయకులు కూడా మినహాయింపు కాదు
అక్రమ ఫ్లెక్సీలు, బ్యానర్ల ఏర్పాటుపై కూడా ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబించనున్నట్లు డీకే శివకుమార్ స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలతో పాటు అన్ని వర్గాల వారు అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారని, ఇందులో తమ పార్టీ నాయకులు కూడా మినహాయింపు కాదని పేర్కొన్నారు.
ఇకపై అనుమతి లేకుండా ఏర్పాటు చేసే ప్రతి ఫ్లెక్సీపై దాని దిగువన పేరు ఉన్న వ్యక్తికే బాధ్యత ఉంటుందని, ఒక్కో ఫ్లెక్సీకి రూ.50 వేల నుంచి రూ.1 లక్ష వరకు జరిమానా విధించనున్నట్లు హెచ్చరించారు. పుట్టినరోజు శుభాకాంక్షలు, వ్యక్తిగత ప్రచార ఫ్లెక్సీల పేరిట నగరాన్ని ఆక్రమించే పరిస్థితికి ఇక ముగింపు పలకాల్సిన సమయం వచ్చిందన్నారు.

Karnataka Footpath Policy | నిర్దిష్ట ప్రకటన బోర్డుల వ్యవస్థ
ప్రభుత్వ ప్రకటనలు లేదా అధికారిక ప్రచారం కోసం ఇప్పటికే నిర్దిష్ట ప్రకటన బోర్డుల వ్యవస్థ ఉందని, వాటిని మాత్రమే వినియోగించాలని సూచించిన ఆయన, ఇతర ప్రాంతాల్లో బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడానికి ఎలాంటి అనుమతి ఉండదని స్పష్టం చేశారు.
కర్ణాటక ప్రభుత్వ తాజా నిర్ణయం నగరాల్లో పాదచారుల భద్రత, అక్రమ ఆక్రమణల నియంత్రణ, విజువల్ కాలుష్యాన్ని తగ్గించే దిశగా కీలక చర్యగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.