అక్షరటుడే, బాన్సువాడ: Banswada DSP Office | ప్రజలకు వేగవంతంగా, పారదర్శకమైన పోలీసు సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ(Banswada) ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (MLA Pocharam Srinivas Reddy) అన్నారు. ఆదివారం బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో(Banswada Government Area Hospital) పోలీస్ హెల్త్ ఔట్పోస్ట్ను ప్రారంభించారు. త్వరలోనే డీఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభిస్తామన్నారు.
Banswada DSP Office | సదరం క్యాంప్, సీఐ కార్యాలయం ప్రారంభం
దివ్యాంగుల సర్టిఫికెట్లు, పెన్షన్ల కోసం శాశ్వత సదరం క్యాంప్ను, అలాగే నూతనంగా నిర్మించిన బాన్సువాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం, ట్రాఫిక్ పోలీస్ కార్యాలయాన్ని రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్, ఎస్పీ రాజేష్ చంద్ర, డీసీసీబీ మాజీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆధునిక సౌకర్యాలతో నిర్మించిన ఈ కార్యాలయాల ద్వారా శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నిర్వహణ మరింత సమర్థవంతంగా సాగుతుందన్నారు. బాన్సువాడ ప్రజలకు నాణ్యమైన ప్రభుత్వ సేవలు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.
Banswada DSP Office | త్వరలోనే బాన్సువాడలో..
నియోజకవర్గంలో పలు ప్రభుత్వ భవనాల నిర్మాణం చేపట్టామని, సిద్ధాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని, దీంతో రైతులకు సాగునీటి సమస్యలు తీరనున్నాయని పోచారం తెలిపారు. శాంతియుత వాతావరణం ఉన్న చోటే అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొంటూ, త్వరలో బాన్సువాడలో డీఎస్పీ కార్యాలయాన్ని కూడా ప్రారంభిస్తామని వెల్లడించారు. ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ, జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తోందన్నారు. డయల్-100 సేవల ద్వారా ఇప్పటివరకు అనేక మంది ప్రాణాలను కాపాడినట్లు తెలిపారు. బాన్సువాడలో పోలీస్ శాఖకు ఆధునిక సౌకర్యాలతో కూడిన కొత్త భవనాలు అందుబాటులోకి రావడం సంతోషకరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రవీందర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.