అక్షరటుడే, వెబ్డెస్క్: Headmaster Suspended | పాఠశాలలో ఉపాధ్యాయుల మధ్య గొడవలు ఉన్నాయి. కొన్ని రోజులగా టీచర్ల మధ్య వివాదాలు నెలకొన్నాయి. అయితే వారికి సర్దిచెప్పాల్సిన హెచ్ఎం.. పాఠశాలలోని విద్యార్థులకు టీసీలు ఇచ్చారు. దీంతో అధికారులు సదరు హెచ్ఎంను సస్పెండ్ చేశారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా (Suryapet District)లో చోటు చేసుకుంది.
తుంగతుర్తి మండలంలోని బండరామారం ఉన్నత పాఠశాలలో కొంతకాలంగా ఉపాధ్యాయుల మధ్య విభేదాలు నెలకొన్నాయి. పాఠాలు చెప్పి విద్యార్థుల భవిష్యత్ను తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులు.. వారిలో వారు గొడవలు పడుతున్నారు. అంతేగాకుండా విద్యార్థుల చదువు విషయంలో పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. అయితే ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాల్సిన హెచ్ఎం హకీమ్.. వారిని ఏమి అనకుండా బడిలోని అందరు విద్యార్థులకు టీసీలు ఇవ్వడం గమనార్హం.
Headmaster Suspended | సస్పెండ్ చేసిన డీఈవో
హెచ్ఎం నిర్ణయంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్ఎం హకీమ్, ఉపాధ్యాయుల మధ్య గొడవలు ఉంటే.. తమ పిల్లలకు టీసీలు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. ఈ విషయం కాస్తా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో అధికారులు విచారణ జరిపారు. నిబంధనలకు విరుద్ధంగా హెచ్ఎం నిర్ణయం తీసుకున్నారని, విద్యార్థుల భవిష్యత్తో ఆటలు ఆడారని గుర్తించారు. ఈ మేరకు హెచ్ఎం హకీమ్ను సస్పెండ్ చేస్తూ డీఈవో అశోక్ ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాలలో గొడవలకు కారణమైన నలుగురు ఉపాధ్యాయులకు సైతం మెమోలు జారీ చేశారు.
ఇది కూడా చదవండి..: New Pensions | ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్లు.. మంత్రి సీతక్క కీలక ప్రకటన