అక్షరటుడే, వెబ్డెస్క్: Revanth Reddy Warning | తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు.
పోలవరం ప్రాజెక్టు కోసం తెలంగాణకు చెందిన ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్లో విలీనం చేశారని గుర్తు చేసిన ఆయన, తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన దాదాపు 2 వేల ఎకరాల భూమిని మహారాష్ట్ర ఇవ్వలేదా..? అని ప్రశ్నించారు.

Revanth Reddy Warning | కిషన్రెడ్డి స్పందించాలి
ఈ అంశంపై పలుమార్లు లేఖలు రాసినా మహారాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి ఎలాంటి స్పందన రాలేదని సీఎం పేర్కొన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ తీసుకుని మహారాష్ట్ర ముఖ్యమంత్రితో సమావేశం ఏర్పాటు చేసి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.
అదే సమయంలో రాష్ట్రంలో రైతుల నుంచి భారీ స్థాయిలో ధాన్యం సేకరిస్తున్నామని సీఎం తెలిపారు. ప్రస్తుతం సుమారు 75 లక్షల క్వింటాళ్ల వడ్లను కొనుగోలు చేస్తున్నామన్నారు.
ఆ ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన పంటను కేంద్రం స్వీకరించేలా చూడటం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాధ్యత అని అన్నారు.
Revanth Reddy Warning | రాజీ పడం
రైతులు పండించిన వడ్లు, జొన్నలు, మొక్కజొన్నలను కేంద్రం తప్పనిసరిగా కొనుగోలు చేయాలని సీఎం డిమాండ్ చేశారు. ఈ విషయంలో కేంద్రం స్పందించకపోతే జూన్ 15 తర్వాత తమ కార్యాచరణను ప్రకటిస్తామని హెచ్చరించారు.
కేంద్రం ధాన్యం కొనుగోలు అంశంలో నిర్ణయం తీసుకోకపోతే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్దే తమ నిరసనను వ్యక్తం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు.
కేంద్రం వద్ద ఈ అంశాన్ని పరిష్కరించడంలో కిషన్ రెడ్డి బాధ్యత తీసుకోకపోతే రాష్ట్రంలో ప్రజల మధ్య తిరగలేని పరిస్థితి వస్తుందని సీఎం వ్యాఖ్యానించారు.


