అక్షరటుడే వెబ్డెస్క్:Education Fee Regulation|సమాజంలో సమానత్వం , స్వేచ్ఛ కేవలం నాణ్యమైన విద్య ద్వారానే సాధ్యమవుతాయని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత స్పష్టం చేశారు. ఇటీవల ‘నాణ్యమైన విద్య – ఫీజుల నియంత్రణ’ అనే అంశంపై ఆమె రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యా వ్యవస్థలో జరుగుతున్న వ్యాపార ధోరణిపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఉచిత విద్య , వైద్యం అందించడం అనేది ఏ ప్రభుత్వానికైనా ప్రాథమిక బాధ్యత అని కవిత గుర్తుచేశారు. విద్యాసంస్థలు ఫీజులను విచ్చలవిడిగా పెంచుతుంటే పాలకులు మౌనంగా ఉండటం సరికాదన్నారు. ప్రస్తుతం మెజారిటీ విద్యాసంస్థలు రాజకీయ నాయకుల చేతుల్లోనే ఉండటం దురదృష్టకరమని, దీనివల్ల విద్య వ్యాపారంగా మారిందని ఆమె విమర్శించారు.
Education Fee Regulation| కమిషన్ల నివేదికలు ఏమయినట్లు?
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫీజుల నియంత్రణ కోసం ‘తిరుపతిరావు కమిషన్’ వేసినప్పటికీ, ఆ నివేదిక అమలులో , ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని ఆమె ఎత్తిచూపారు. కేవలం ప్రభుత్వ గురుకులాలు ఏర్పాటు చేసినంత మాత్రాన సరిపోదని, ప్రైవేటు స్కూళ్లలో చదువుతున్న సుమారు 75 శాతం మంది విద్యార్థుల పరిస్థితిని ప్రభుత్వం పట్టించుకోవాలని డిమాండ్ చేశారు.
Education Fee Regulation| ముఖ్యమంత్రికి సూటి ప్రశ్న..
రాష్ట్రంలో కార్పొరేట్ విద్యాసంస్థల దోపిడీని నియంత్రించేందుకు ప్రభుత్వం తక్షణమే జీవో జారీ చేయాలని కవిత డిమాండ్ చేశారు. గతేడాదితో పోలిస్తే ఒక్క రూపాయి కూడా ఫీజు పెరగకుండా చర్యలు తీసుకోవాలి. ప్రైవేట్ పాఠశాలల ప్రారంభోత్సవాలకు ముఖ్యమంత్రి హాజరవ్వడం ద్వారా ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారని ఆమె ప్రశ్నించారు. ఇలాంటి చర్యలు ప్రైవేట్ దోపిడీని ప్రోత్సహించినట్లే అవుతాయని ఆమె ఆరోపించారు. విద్యా దోపిడీకి ఇప్పుడే పరిష్కారం చూపకపోతే భవిష్యత్ తరాలకు తీరని అన్యాయం జరుగుతుందని ఆమె హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: Vijay Oath Taking | రేపే విజయ్ ప్రమాణ స్వీకారం.. మెజారిటీ కోసం కసరత్తు, మద్ధతుపై కొనసాగుతున్న సస్పెన్స్

