అక్షరటుడే, వెబ్డెస్క్ : Government Doctors Strike | రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో (Government Hospitals) నేటి నుంచి ఓపీ సేవలు నిలిచిపోయాయి. బదిలీల ప్రక్రియ సక్రమంగా చేపట్టలేదని వైద్యులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు సమ్మెకు పిలుపునిచ్చారు.
రాష్ట్ర వ్యాప్తంగా అన్నిశాఖల్లో ప్రభుత్వం బదిలీలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ మేరకు జీవో 38 జారీ చేసింది. అయితే ప్రభుత్వ ఆస్పత్రుల వైద్యుల బదిలీల్లో నిబంధనలను పాటించలేదని తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (Telangana Government Doctors Association) ఆరోపించింది. జీవో ప్రకారం బదిలీలు నిర్వహించకుండా అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని పేర్కొంది. దీంతో చాలా మంది వైద్యులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.
Government Doctors Strike | పారదర్శకంగా చేపట్టాలి

బదిలీల్లో పారదర్శకత ఉండాలని టీజీజీడీఏ కోరింది. నిబంధనలను పక్కాగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా వైద్య సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వ వైద్యులు ప్రకటించారు. స్పౌజ్(భార్యాభర్తలు) కేటగిరీ, అనారోగ్య సమస్యలు ఉండి బదిలీల్లో ప్రాధాన్యత కోరుతున్న వారికి న్యాయం జరగడం లేదని టీజీజీడీఏ (TGGDA) ఆగ్రహం వ్యక్తం చేసింది.
Government Doctors Strike | అత్యవసర సేవలు మినహా
ఉస్మానియా, గాంధీ, నిలోఫర్తో పాటు అన్ని జిల్లాల ఆసుపత్రుల్లో ఓపీ సేవలను బహిష్కరిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. అత్యవసర సర్జరీలు మినహా, ముందుగా నిర్ణయించిన ఆపరేషన్లను కూడా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. తమ సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఇది కూడా చదవండి..: Anganwadi Holidays Extension | అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు పొడిగింపు: జూన్ 15న పునఃప్రారంభం
