అక్షరటుడే వెబ్డెస్క్: Kishan Reddy HYDRA | హైడ్రా కూల్చివేతల్లో ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ( Kishan Reddy )మండిపడ్డారు. పేదల ఇళ్లను కూల్చివేయడంలో చూపిస్తున్న దూకుడును, మజ్లిస్ పార్టీకి చెందిన ఆస్తుల విషయంలో ఎందుకు చూపించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ప్రజల ఆస్తులను తాకట్టు పెట్టడం తగదని ఆయన హెచ్చరించారు.
Kishan Reddy HYDRA | మజ్లిస్పై ఎందుకు చర్యలు లేవు?
సల్కం చెరువు ఎఫ్.టి.ఎల్ (FTL) పరిధిలో ఉన్న భూములు, ఫాతిమా విద్యాసంస్థల ఆక్రమణల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని కిషన్ రెడ్డి నిలదీశారు. “ఎంఐఎం అంటే ప్రభుత్వానికి భయమా? లేక ప్రేమనా? లేదా ఈ రెండూనా?” అని ఆయన సూటిగా ప్రశ్నించారు. కేవలం కమిషన్ల కక్కుర్తి కోసమే పేద, మధ్యతరగతి ప్రజల పొట్ట కొడుతున్నారని ఆయన ఆరోపించారు.
Kishan Reddy HYDRA | రాజకీయ ప్రయోజనాల కోసమే కూటమి..
హైడ్రా కూల్చివేతల్లో పేద ముస్లింలు కూడా తమ ఇళ్లను, జీవనోపాధిని కోల్పోయారని, వారి తరఫున ఎంఐఎం కానీ, కాంగ్రెస్ కానీ ఎందుకు నిలబడలేదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. “పేదల విషయానికి వస్తే పట్టించుకోరు, అదే మజ్లిస్ ఆస్తుల దగ్గరకు వచ్చేసరికి రెండు పార్టీలు కలిసికట్టుగా రక్షణగా నిలుస్తాయి. దీన్ని బట్టి వారికి ముస్లిం సమాజంపై ప్రేమ కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టమవుతోంది” అని ఆయన విమర్శించారు.
Kishan Reddy HYDRA | ఒకే న్యాయం ఉండాలి..
రాష్ట్రంలోని ప్రభుత్వ భూములు, చెరువులు తెలంగాణ ప్రజల సొత్తు అని, అవి రాజకీయ రక్షణలో ఉన్న కొందరి సొత్తు కాదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ విధానాలు “పేదవాడికి బుల్డోజర్లు.. మిత్రపక్షానికి రక్షణ” అన్నట్లుగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఇకనైనా ఓటు బ్యాంకు రాజకీయాలు మానుకుని, రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి సమానమైన చట్టం, ఒకే న్యాయం వర్తింపజేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదే తీరు కొనసాగితే రాబోయే రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: Hormuz Transit Fee | ఇరాన్ కీలక నిర్ణయం.. హర్మూజ్లో నౌకల ప్రయాణానికి ఇక ఛార్జీలు వసూలు