అక్షరటుడే వెబ్డెస్క్: YDRAA Commissioner | కోర్టు ఉత్తర్వులు , ఇచ్చిన హామీలను ఉల్లంఘించినందుకు గాను హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRAA) కమిషనర్ ఎ.వి. రంగనాథ్పై తెలంగాణ హైకోర్టు ( Telangana High Court ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్ట పాలనను అతిక్రమించినందుకు ఆయన్ను తక్షణమే హైడ్రా కమిషనర్ పదవి నుంచి తప్పించాలని, ఆ స్థానంలో మరొక అర్హులైన అధికారిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజును ఆదేశించింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా లోతుకుంట గ్రామంలోని వివాదాస్పద 40 ఎకరాల భూమికి సంబంధించి ‘శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్’ దాఖలు చేసిన ధిక్కరణ పిటిషన్పై జస్టిస్ అనిల్ కుమార్ జూకంటి ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది.
HYDRAA Commissioner | కోర్టు ధిక్కరణే కారణం..
సదరు భూమి ప్రైవేటు ఆస్తి అని సివిల్ కోర్టు, హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టం చేసిన విషయాన్ని ధర్మాసనం గుర్తుచేసింది. ఆ ఆస్తిలోకి తాము గానీ, సిబ్బంది గానీ ప్రవేశించబోమని హైడ్రా గతంలో కోర్టుకు లిఖితపూర్వక హామీ ఇచ్చింది. అయినప్పటికీ ఆ హామీని ఉల్లంఘించి, భారీ పోలీసు బలగాలు , జేసీబీలతో స్థలంలోకి ప్రవేశించి కూల్చివేతలు చేపట్టడం కోర్టు ఆదేశాలను ధిక్కరించడమేనని స్పష్టం చేసింది.
HYDRAA Commissioner | చట్టానికి ఎవ్వరూ అతీతులు కారు..
గ్రీకు పురాణాల్లోని ‘హైడ్రా’ రాక్షస సర్పంలా తాము తిరుగులేనివారమని భావించకూడదని హైడ్రాను కోర్టు హెచ్చరించింది. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేయడం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధమని పేర్కొంది. “వ్యక్తుల పాలన కాదు, చట్ట పాలనే నడవాలి” అని స్పష్టం చేస్తూ రంగనాథ్ను పదవి నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది.
ఇది కూడా చదవండి: Cauvery Dispute | ముదురుతున్న కావేరి జలవివాదం.. తమిళనాడు సీఎంతో చర్చలు రద్దు