అక్షరటుడే వెబ్డెస్క్: Hyderabad Metro Phase 2 | హైదరాబాద్ మెట్రోరైల్ రెండో దశలో భాగంగా పాతబస్తీ మెట్రో పనుల్లో వేగం పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL)పై సీఎం ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పాతబస్తీ మెట్రో పనులపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కి.మీ పొడవునా రోడ్డు విస్తరణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ కారిడార్లో మెట్రో పనులకు సంబంధించి టెండర్ ప్రక్రియను మొదలు పెట్టాలని తెలిపారు. మెట్రో విస్తరణకు సంబంధించి పెండింగ్లో ఉన్న భూ సేకరణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సూచించారు.
Hyderabad Metro Phase 2 | అదనపు బోగీల ఏర్పాటు..
హైదరాబాద్ మెట్రోకు రోజురోజుకు రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రయాణీకుల సౌకర్యార్థం అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. రద్దీకి తగినట్టుగా మెట్రో రైల్కు అదనపు బోగీలను జత చేయాలని సూచించారు. ఇందుకు సంబంధించి మెట్రో రైల్ కోచ్లను కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మెట్రో ఫేజ్-2 లో భాగంగా ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కి.మీ కారిడార్ కోసం ప్రస్తుత టెక్నాలజీపై ఢిల్లీ మెట్రోను సంప్రదించి తగిన సలహాలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.
Hyderabad Metro Phase 2 | ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్..
డిసెంబర్లో నిర్వహించ తలపెట్టిన ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సమ్మిట్ నిర్వహణకు ముందస్తు ఏర్పాట్లు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. వ్యాపార రంగంలో వివిధ సెక్టార్లలో గుర్తింపు పొందిన ప్రముఖులను సమ్మిట్లో సన్మానించేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. తెలంగాణలో పెట్టుబడులను ఆకర్షించేలా అంతర్జాతీయ ప్రమాణాలతో సమ్మిట్ ఏర్పాట్లు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. గత సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, పురోగతికి సంబంధించిన పూర్తి వివరాలను నివేదించాలని, భవిష్యత్తులో పెట్టుబడులను మరింతగా ఆకర్షించేలా పకడ్బందీ ప్రణాళికలు తయారు చేయాలని స్పష్టం చేశారు.
Hyderabad Metro Phase 2 | సమావేశంలో పాల్గొన్న ప్రముఖులు..
ఈ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్, ప్రభుత్వ సలహాదారులు రామకృష్ణారావు, ఎన్వీఎస్ రెడ్డి, మెట్రో రైల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, అదనపు ఎండీ అజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో మెట్రో విస్తరణ పనులతో పాటు పెట్టుబడుల ఆకర్షణకు సంబంధించిన అంశాలపై ఈ భేటీలో విస్తృతంగా చర్చించారు.
CM Revanth Reddy Directs Faster Old City Metro Works, Early Tendering, Land Acquisition and Additional Coaches to Meet Rising Passenger Demand
పాతబస్తీ మెట్రో పనుల్లో వేగం పెంచండి
వీలైనంత త్వరగా టెండర్ ప్రక్రియ ప్రారంభించాలి
మెట్రో రద్దీకి అనుగుణంగా కొత్త కోచ్ లు కొనుగోలు… pic.twitter.com/gGW1m7BYmd
— Congress for Telangana (@Congress4TS) August 11, 2026
ఇది కూడా చదవండి: Sant Namdev Maharaj | భక్తిశ్రద్ధలతో సంత్ నాందేవ్ మహరాజ్ పుణ్యతిథి