Cheyutha Pension Scheme | తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్.. కొత్త ఆసరా పింఛన్లకు రంగం సిద్ధం

తెలంగాణలో అర్హులైన పేదలు, బలహీన వర్గాల సంక్షేమం లక్ష్యంగా 'చేయుత' సామాజిక భద్రతా పింఛన్ల పథకం కింద కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Cheyutha Pension Scheme | తెలంగాణలో అర్హులైన పేదలు, బలహీన వర్గాల సంక్షేమం లక్ష్యంగా ‘చేయుత’ సామాజిక భద్రతా పింఛన్ల పథకం కింద కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు గ్రామీణాభివృద్ధి శాఖ సెర్ప్ (SERP) నుంచి అధికారిక సర్క్యులర్ వెలువడింది. తొలి విడతలో వివిధ వర్గాలకు చెందిన అర్హులకు పింఛన్లు మంజూరు చేయనున్నారు.

Cheyutha Pension Scheme | తొలి విడతలో లబ్ధి చేకూరే వర్గాలు..

మొదటి విడతలో ఒంటరి మహిళలు, విధవలు (వితంతువులు), దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, ఫైలేరియా (బోధకాలు) బాధితులు, అలాగే తలసేమియా, సికిల్ సెల్ ఎనీమియా, హిమోఫీలియా వంటి రక్త సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రాధాన్యత క్రమంలో పింఛన్లు మంజూరు చేయనున్నారు. 2014 నుంచి 2018 మధ్య గత ప్రభుత్వాలు జారీ చేసిన జీవోల ఆధారంగానే ప్రస్తుత నిబంధనలు, అర్హతలను అమలు చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

Cheyutha Pension Scheme | దరఖాస్తుల స్వీకరణ..

ఇప్పటికే ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక 99 రోజుల గ్రామ సభలు, ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. అయితే, ఇంతవరకు దరఖాస్తు చేయని వారు లేదా సరైన ధ్రువపత్రాలు సమర్పించని వారు కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఆగస్టు 31, 2026 వరకు కొనసాగుతుంది. పంచాయతీ కార్యదర్శులు, వార్డ్ ఆఫీసర్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్ల ద్వారా దరఖాస్తులు స్వీకరించి రసీదు అందజేస్తారు.

Cheyutha Pension Scheme | పరిశీలన ప్రక్రియ..

లబ్ధిదారుల ఎంపికలో భాగంగా వితంతువులకు భర్త మరణ ధ్రువపత్రం, ఒంటరి మహిళలకు సెపరేషన్ లేదా స్థానిక విచారణ నివేదిక అవసరం. అలాగే గీత కార్మికులకు ఎక్సైజ్ శాఖ, చేనేత కార్మికులకు చేనేత జౌళి శాఖ, ఫైలేరియా బాధితులకు వైద్య ఆరోగ్య శాఖల నుంచి ధ్రువీకరణ తప్పనిసరి. క్షేత్రస్థాయిలో దరఖాస్తులను పరిశీలించి, అర్హుల జాబితాను జిల్లా కలెక్టర్ ఆమోదంతో ఫైనల్ చేస్తారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పారదర్శకంగా ఈ పథకం అందేలా స్వయం సహాయక సంఘాల (SHG) మహిళా సమాఖ్యలకూ బాధ్యతలు అప్పగించారు. దరఖాస్తుల వివరాలను చేయుత పోర్టల్ (https://cheyutha.telangana.gov.in) లో నమోదు చేయనున్నారు.


ఇది కూడా చదవండి: Junior Colleges TC Issue | టీసీలివ్వకుండా వేధిస్తున్న జూనియర్​ కళాశాలలపై చర్యలు తీసుకోవాలి

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *