అక్షరటుడే, వెబ్డెస్క్: Jaishankar Bangladesh Relations | భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు ‘పరస్పర ప్రయోజనాల’ పరీక్షలో నెగ్గితేనే విజయవంతం అవుతాయని విదేశాంగ మంత్రి (ఈఏఎం) డాక్టర్ ఎస్.జైశంకర్ అభిప్రాయపడ్డారు. అదే సమయంలో, పొరుగు దేశాలు ఎల్లప్పుడూ తమ ప్రయోజనాలకు అనుగుణంగానే ప్రవర్తిస్తాయని ఆశించలేమన్నారు. బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహమాన్ భారత పర్యటనపై వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Jaishankar Bangladesh Relations | ప్రశ్నకు సమాధానంగా..
పదవీచ్యుత ప్రధాని షేక్ హసీనాను అప్పగించాలని బంగ్లాదేశ్ చేస్తున్న అభ్యర్థనలపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. శనివారం ఎకనామిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరంలో మాట్లాడుతూ జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. “ఏ సంబంధమైనా విజయవంతం కావాలంటే, అది పరస్పర ప్రయోజనాల పరీక్షలో నెగ్గాలి. అది మనకు అనుకూలంగా పనిచేయాలి,” అని పేర్కొన్నారు.
Jaishankar Bangladesh Relations | అలా ఆశించడం లేదు..
పొరుగు దేశాలు కేవలం తమ ప్రయోజనాలకు అనుకూలమైన పనులే చేయాలని నేను ఆశించడం లేదని జైశంకర్ అన్నారు. వారు కూడా అలాగే చేయాలని నేను ఆశిస్తున్నట్లే, వారి ప్రయోజనాలను నేను కూడా సహేతుకమైన స్థాయిలో గుర్తించి, గౌరవించాలన్నారు. ఒక అవగాహనకు వచ్చినప్పుడే, ఒక ఉమ్మడి వేదిక దొరికినప్పుడే సంబంధాలు సజావుగా సాగుతాయని పేర్కొన్నారు.
Jaishankar Bangladesh Relations | జైశంకర్ వ్యాఖ్యలు ఎందుకు కీలకం
హసీనాను అధికారం నుంచి తొలగించిన అనంతరం తీవ్రంగా దెబ్బతిన్న తమ సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి భారత్, బంగ్లాదేశ్ ప్రయత్నిస్తున్న తరుణంలో విదేశాంగ మంత్రి వ్యాఖ్యలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. మహమ్మద్ యూనస్ హయాంలో హసీనాను అప్పగించాలన్న డిమాండ్ను ఢాకా పునరుద్ఘాటించడంతో సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే, రెహమాన్ అధికారంలోకి రావడంతో, దెబ్బతిన్న సంబంధాలు నెమ్మదిగా మెరుగుపడడం ప్రారంభించాయి. దీనిపై కొంత అనిశ్చితి ఉన్నప్పటికీ, రెహమాన్ త్వరలో భారతదేశాన్ని సందర్శించే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి..: Toxic Event Accident | టాక్సిక్ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ప్రమాదం.. పలువురికి గాయాలు