అక్షరటుడే, వెబ్డెస్క్: Kaleshwaram Project | కాళేశ్వరంపై కాంగ్రెస్ చేసిన దుష్ప్రచారానికి ఎన్డీఎస్ఏ అఫిడవిట్, CWPRS రిపోర్టులు చెంపపెట్టు అని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. అవసరాన్ని బట్టి కాళేశ్వరం నుంచి నీటిని లిఫ్ట్ చేసుకోవచ్చని స్వయంగా NDSA అఫిడవిట్లో స్పష్టం చేసిందని పేర్కొన్నారు.
CWPRS పరిశీలనలో సైతం అన్నారం, సుందిళ్లలో ఏ బ్లాక్లోనూ నిర్మాణపరమైన సమస్య లేదని, కాంక్రీట్ నాణ్యత కూడా బాగుందని వెల్లడైందని తెలిపారు. అయినా రాజకీయ కక్షతో కాళేశ్వరం ప్రాజెక్టును పక్కన పెట్టి, తెలంగాణకు వచ్చిన గోదావరి నీటిని వినియోగించుకోకుండా ప్రభుత్వం కిందికి వదిలేయడం క్రిమినల్ నెగ్లిజెన్స్కు నిదర్శనమన్నారు. దీంతో రాష్ట్ర రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Kaleshwaram Project | తెలంగాణ రైతులకు కన్నీళ్లు
కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీకి నీళ్లు వదిలి, తెలంగాణక రైతులకు కన్నీళ్లు మిగిల్చిందని హరీశ్రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా జలాశయాల్లో నీటి నిల్వలు సగటున 64.16 శాతం ఉండగా.. తెలంగాణలో మాత్రం 35.6 శాతం మాత్రమే ఉన్నాయన్నారు. ఇది ప్రకృతి వైపరీత్యం కాదని, నీటి నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని మండిపడ్డారు. నిండుగా పారిన గోదావరి, కృష్ణా నీళ్లను కిందకు విడిచిపెట్టి రాష్ట్రానికి కాంగ్రెస్ ద్రోహం చేసిందన్నారు. కమిషన్లు వేయడానికి, విచారణలు చేయడానికి ఉన్న శ్రద్ధ.. కిందికి పోతున్న గోదావరి, కృష్ణా జలాలను ఒడిసిపట్టి రైతులకు అందించడంలో ఎందుకు లేదని మాజీ మంత్రి ప్రశ్నించారు.
పార్టీలో కుమ్ములాటలు, కొట్లాటలపై శ్రద్ధ పక్కనపెట్టి ప్రాజెక్టుల నిర్వహణ, నీటి హక్కులు, రైతుల ప్రయోజనాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని హరీశ్రావు సూచించారు. కాళేశ్వరంపై దుష్ప్రచారం మానేసి, అన్నారం, సుందిళ్ల మోటార్లు ఆన్ చేసి గోదావరి నీటిని ఎత్తిపోయాలని డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి..: IPS Status | ఏడుగురు ఎస్పీలకు ఐపీఎస్ హోదా