అక్షరటుడే, వెబ్డెస్క్ : Cyber Frauds | సైబర్ దొంగలు రెచ్చిపోతున్నారు. మాయ మాటలతో ప్రజలను బురిడీ కొట్టించి ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. అంతేగాకుండా ఫోన్లను చోరీ చేసి సైతం సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ (Hyderabad) పోలీస్ కమిషనర్ సజ్జనార్ (CP Sajjanar) సూచించారు.
జేబుదొంగతనాలకు ఆధునిక సైబర్ నేరాలను జోడించి అమాయకుల బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తున్న సరికొత్త హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్ ముఠాల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సీపీ కోరారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు, సాంకేతిక పరిజ్ఞానం తక్కువగా ఉన్నవారే లక్ష్యంగా ఈ ముఠాలు దోపిడీకి పాల్పడుతున్నట్లు తెలిపారు. బస్టాండ్లు, రద్దీ బస్సుల్లో ప్రయాణికులు ఫోన్ అన్లాక్ చేసే సమయంలో పిన్/ప్యాటర్న్ నిశితంగా గమనించి ఫోన్లను చోరీ చేస్తున్నారని పేర్కొన్నారు.
Cyber Frauds | వెరిఫికేషన్ పేరిట..
నిందితులు ఫోన్ చోరీ చేస్తున్నారు. అనంతరం లాక్ తెలియకపోతే.. ఫోన్ కోసం బాధితులు కాల్ చేసినప్పుడు ఓనర్ వెరిఫికేషన్ కోసం లాక్ అడుగుతున్నారు. అనంతరం ఫోన్ గ్యాలరీ, నోట్స్ యాప్లలో దాచుకున్న డెబిట్ కార్డులు, ఆధార్/పాన్ వివరాలను సేకరించి సైబర్ నేరాలు చేస్తున్నారు. ఇలా నేరాలకు పాల్పడుతున్న ముగ్గురిని ఇప్పటికే అరెస్ట్ చేసినట్లు సీపీ వెల్లడించారు. నిందితుల నుంచి 5 ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ తరహా నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరారు. ఫోన్ పోతే.. పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. ఎవరికీ కూడా స్క్రీన్ లాక్ పిన్, ఓటీపీలు చెప్పవద్దని సూచించారు.
ఇది కూడా చదవండి : Harish Rao | భూములు కబ్జా చేస్తున్న సీఎం రేవంత్రెడ్డి : హరీశ్రావు