అక్షరటుడే, వెబ్డెస్క్: Nizamabad prohibited land | నిషేధిత ఆస్తుల జాబితాలో ఉన్న భూమిని కాజేయడానికి పక్కా స్కెచ్ వేసి, అసలు యజమానులు కాకపోయినా వారినే భూస్వాములుగా చూపించి నకిలీ విక్రయ పత్రాలు సృష్టించిన వ్యవహారం నిజామాబాద్లో సంచలనం రేపుతోంది.
అర్సపల్లి Arsapally గ్రామంలోని సర్వే నంబరు 169/3లోని నిషేధిత భూమికి సంబంధించి ఏకంగా ఏడు సేల్డీడ్లు రిజిస్టర్ కావడం అధికార యంత్రాంగంలో కలకలం రేపింది. ఈ కేసులో A4గా ఉన్న సబ్-రిజిస్ట్రార్ ఖుద్సియా బాదర్ను ఒకటో ఠాణా పోలీసులు మంగళవారం అరెస్టు చేసి, జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరిచారు.
పోలీసుల దర్యాప్తు ప్రకారం.. ఈ భూమిని జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం ఇప్పటికే 18-10-2022న జారీ చేసిన మెమో నం. G3/A28/2022 ద్వారా నిషేధిత ఆస్తుల జాబితాలో చేర్చింది. నిషేధిత భూమికి రిజిస్ట్రేషన్ చేయాలంటే సంబంధిత అధికారుల నుంచి ముందస్తు అనుమతి/ఎన్ఓసీ అవసరం ఉన్నప్పటికీ, ఆ నిబంధనలను పక్కన పెట్టి రిజిస్ట్రేషన్లు జరిగినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
Nizamabad prohibited land | ఏడు డాక్యుమెంట్లు.. ఒకే భూమి
ఈ వ్యవహారంలో 12038/2022, 10466/2022, 10237/2022, 12650/2022, 12651/2022, 12652/2022, 12653/2022 నంబర్లతో ఏడు విక్రయ పత్రాలు రిజిస్టర్ అయినట్లు పోలీసులు గుర్తించారు. రిజిస్ట్రేషన్ శాఖ నుంచి సేకరించిన సర్టిఫైడ్ కాపీలు, అధికారిక రికార్డుల పరిశీలనలో ఈ డాక్యుమెంట్లలో పేర్కొన్న ప్లాట్లు నిషేధిత సర్వే నంబరులోనే ఉన్నట్లు తేలిందని పోలీసులు పేర్కొన్నారు.
Nizamabad prohibited land | యజమానులు కాకపోయినా.. యజమానులుగా!
దర్యాప్తులో మరో కీలక అంశం వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఆస్తిపై ఎలాంటి హక్కు, లేని వ్యక్తులను యజమానులుగా చూపించి, వారి ద్వారా విక్రయ పత్రాలు సృష్టించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ మొత్తం వ్యవహారం వెనుక ప్రధాన నిందితుడు అజ్వతుల్లా ఖాన్ ఇతరులతో కలిసి కుట్ర పన్నినట్లు దర్యాప్తు అధికారులు ఆరోపిస్తున్నారు.
Nizamabad prohibited land | రూ.20 వేల కోసం ‘నకిలీ ఓనర్’?
కేసులో నిందితురాలిగా పేర్కొన్న మాండా జయను 22-06-2026న పోలీసులు అరెస్టు చేశారు. మధ్యవర్తుల సమక్షంలో ఆమె ఇచ్చిన వాంగ్మూలం దర్యాప్తులో కీలకంగా మారినట్లు పోలీసులు తెలిపారు. తనకు ఆ భూమిపై ఎలాంటి హక్కు లేకపోయినా, అజ్వతుల్లా ఖాన్ సూచనల మేరకు విక్రయ పత్రాలపై సంతకాలు చేసినట్లు, ఇందుకు రూ.20 వేలు తీసుకున్నట్లు ఆమె వెల్లడించినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఆమె వాంగ్మూలం ఆధారంగా మరో నిందితురాలు మలేకా బేగంతో పాటు కొనుగోలుదారులు, ఇతర వ్యక్తుల పాత్రపైనా పోలీసులు దృష్టి సారించినట్లు సమాచారం.
Nizamabad prohibited land | సబ్రిజిస్ట్రార్ పాత్రపై ఆరోపణలు
నిషేధిత ఆస్తి రిజిస్ట్రేషన్ సమయంలో సంబంధిత రికార్డులను పరిశీలించి ఆస్తి స్థితిని నిర్ధారించాల్సిన బాధ్యత రిజిస్ట్రేషన్ అధికారులపై ఉంటుందని అధికారిక రికార్డులు స్పష్టం చేస్తున్నాయని పోలీసులు తెలిపారు. అయినప్పటికీ రిజిస్ట్రేషన్లు జరగడంపై అప్పటి సబ్రిజిస్ట్రార్ ఖుద్సియా బదర్ పాత్రపై తీవ్ర ఆరోపణలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఆమెను ఈ కేసులో ఏ4గా చేర్చి అరెస్టు చేశారు. నిందితులతో కుమ్మక్కై నిషేధిత ఆస్తి రిజిస్ట్రేషన్లకు ఆమె సహకరించినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు పోలీసులు పేర్కొన్నారు.
Nizamabad prohibited land | ‘పెద్ద కుట్ర’పై పోలీసుల ఫోకస్
ఇది కేవలం నకిలీ డాక్యుమెంట్ల వ్యవహారమేనా? లేక దీని వెనుక పెద్ద భూకబ్జా ముఠా ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. నిందితుల మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలు, రిజిస్ట్రేషన్ల వెనుక ఉన్న వ్యక్తులు, కొనుగోలుదారుల పాత్ర, నిషేధిత భూమి తెలిసి కూడా డాక్యుమెంట్లు రిజిస్టర్ చేయించారా? అనే అంశాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
Pawan Kalyan Telangana Strategy | పవన్ కళ్యాణ్ తెలంగాణ ‘మిషన్’: Gen-Z మంత్రం వర్కవుట్ అవుతుందా?
నిందితుల వాంగ్మూలాలు, రిజిస్ట్రేషన్ శాఖ రికార్డులు, సర్టిఫైడ్ డాక్యుమెంట్లు తదితర ఆధారాల ఆధారంగా కుట్ర, మోసం, ఫోర్జరీ, నకిలీ పత్రాలను అసలైనవిగా వినియోగించడం, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ తదితర ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నారు.
నిషేధిత ఆస్తి జాబితాలో ఉన్న భూమికి రిజిస్ట్రేషన్ ఎలా జరిగింది? నిబంధనలను ఎవరు ఉల్లంఘించారు? ఈ ఏడు డాక్యుమెంట్ల వెనుక అసలు సూత్రధారులు ఎవరు? అనే ప్రశ్నలకు దర్యాప్తు పూర్తయితే మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.