అక్షరటుడే వెబ్డెస్క్: Telangana High Court | శాసనసభ సమావేశాల తొలి రోజే అసెంబ్లీ గేట్ వద్ద చోటుచేసుకున్న ఉద్రిక్తతలు, పోలీసుల తీరుపై రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేగిన నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు కీలక జోక్యం చేసుకుంది. పోలీసుల వ్యవహారశైలిని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అత్యవసరంగా హైకోర్టును ఆశ్రయించగా.. ఈ పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం ప్రభుత్వానికి, పోలీసు శాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
Telangana High Court | అడ్డుకోవడానికి వీలేదు..
సభకు హాజరయ్యే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఎట్టి పరిస్థితుల్లోనూ పోలీసులు అడ్డుకోవడానికి వీలేదని హైకోర్టు తేల్చిచెప్పింది. ప్రజాప్రతినిధులు తమ విధులకు హాజరవుతున్న సమయంలో పోలీసులు జోక్యం చేసుకోవడం సరికాదని స్పష్టం చేసింది. ఒకవేళ సభ్యులు ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే, వారిపై చర్యలు తీసుకునే పూర్తి అధికారం కేవలం స్పీకర్కు మాత్రమే ఉంటుందని, పోలీసులకు ఆ చట్టపరమైన అధికారం లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది.
Telangana High Court | దాడి ఘటనపై సీరియస్..
ఈ నిరసనల సందర్భంగా మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులు దౌర్జన్యం చేశారన్న ఆరోపణలను హైకోర్టు అత్యంత తీవ్రంగా పరిగణించింది. మహిళా ప్రజాప్రతినిధుల పట్ల దురుసుగా ప్రవర్తించి, దాడికి పాల్పడిన పోలీసు సిబ్బందిని వెంటనే గుర్తించాలని ఆదేశించింది. బాధ్యులైన ఆ పోలీసులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ సీవీ ఆనంద్ను ( CV Anand )హైకోర్టు ఆదేశించింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ తరఫు న్యాయవాదికి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ఇరువైపుల వాదనలను విన్న అనంతరం, ఈ కేసు విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
ఇది కూడా చదవండి: Tata Madhu Dismissal | తాతా మధును డిస్మిస్ చేయాలి : సీఎం రేవంత్ రెడ్డి