అక్షరటుడే, వెబ్డెస్క్ : Governor Meeting | రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం అనంతరం జరిగిన పరిణామాలతో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది. బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేలపై కేసులు నమోదు చేసిన ప్రభుత్వం.. చర్యలకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో కాంగ్రెస్ ముఖ్య నేతలు బుధవారం సాయంత్రం గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా సోమవారం ఉద్రిక్తత చోటు చేసుకున్న విషయం తెలిసిందే. నల్ల టీ షర్టులు ధరించి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, బీఆర్ఎస్ సభ్యులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. అంతేగాకుండా ఎమ్మెల్సీ తాతా మధు (MLC Madhu) స్పీకర్ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్పై పోలీసులు కేసు పెట్టి అరెస్ట్ చేశారు. అంతేగాకుండా పోలీసులపై దాడి చేశారని కేటీఆర్, హరీశ్రావు సహా ఎమ్మెల్యేలపై రెండు కేసులు నమోదు అయ్యాయి. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి, దోషులను కఠినంగా శిక్షిస్తామని సీఎం సభలో ప్రకటించారు. అనంతరం కాంగ్రెస్ నేతలు గవర్నర్తో భేటీ అయ్యారు.
Governor Meeting | ఉచ్చు బిగుస్తుందా..
అసెంబ్లీ ఎదుట జరిగిన పరిణామాలపై బుధవారం మధ్యాహ్నం బీఆర్ఎస్ సభ్యులు గవర్నర్ను కలిశారు. మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులు దాడి చేశారని చెప్పారు. అయితే బీర్ఎస్ సభ్యులే పోలీసులపై దాడి చేశారని, ఎమ్మెల్సీ తాతా మధు స్పీకర్ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ నాయకులు పేర్కొంటున్నారు. అంతేగాకుండా ఎర్రవల్లి కాంగ్రెస్ నేతలు కేసీఆర్ ఫామ్హౌస్ ముట్టడికి వెళ్లగా.. బీఆర్ఎస్ కార్యకర్తలు శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. ఈ ఘటనలపై ప్రభుత్వం సీరియస్గా ఉంది. ఇప్పటికే విచారణ కోసం సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) ప్రత్యేకాధికారిని నియమించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతల చుట్టూ ప్రభుత్వం ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ నేతలు గవర్నర్ను కలిశారు. అయితే ఏ విషయంలో వారు కలిశారనే వివరాలు తెలుపకపోవడంతో ఉత్కంఠ నెలకొంది.
Governor Meeting | డిప్యూటీ సీఎం ఆధ్వర్యంలో..
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka), మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి, గడ్డం వివేక్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్, ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు, కవ్వంపల్లి సత్యనారాయణ గవర్నర్ను కలిసిన వారిలో ఉన్నారు. ఆయనతో భేటీ అనంతరం వీరు వినతి పత్రం సమర్పించారు. గవర్నర్ను కలిసిన వారిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నేతలు మాత్రమే ఉండటం గమనార్హం.
దీనిని కూడా చదవండి : Assembly Incident | బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం : సీఎం రేవంత్రెడ్డి