అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Alprazolam Drug Case | నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్ అక్రమ రవాణాతో సంపాదించిన ఆస్తులను జప్తు చేస్తున్నామని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆయన వివరాలు వెల్లడించారు.
Alprazolam Drug Case | అల్ప్రాజోలం అక్రమ రవాణాపై ఉక్కుపాదం..
అల్ప్రాజోలం వంటి మత్తు పదార్థాల అక్రమ తయారీ, రవాణా, సరఫరా, విక్రయాలకు పాల్పడుతున్న వ్యక్తులపై పోలీస్ శాఖ కఠిన చర్యలు చేపడుతోందని సీపీ (CP Sai Chaitanya) పేర్కొన్నారు. నిజామాబాద్ ఏసీపీ బి. ప్రకాష్ పర్యవేక్షణలో రూరల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, నిజామాబాద్ ఈగల్ టీమ్ ఆధ్వర్యంలో చేపట్టిన దర్యాప్తులో అంతర్రాష్ట్ర ఆల్ప్రాజోలం అక్రమ సరఫరా నెట్వర్క్ను ఛేదించామని సీపీ తెలిపారు. రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అల్ప్రాజోలం అక్రమ సరఫరాకు పాల్పడుతున్న ఐదుగురు అంతర్రాష్ట్ర డ్రగ్ స్మగ్లర్లపై ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి నలుగురిని అరెస్ట్ చేసి జైలుకు పంపామన్నారు. వారి వద్ద నుండి సుమారు 1.087 కిలో గ్రామ్స్ అల్ప్రాజోలం స్వాధీనం చేసుకున్నామని.. దాని విలువ సుమారు రూ.4.50 లక్షలు ఉంటుందన్నారు. అలాగే రెండు కార్లు, 5 మొబైల్ ఫోన్లు, రూ.3.50 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామని వివరించారు.
Alprazolam Drug Case | రాజస్థాన్ నుంచి..
కేసు దర్యాప్తులో భాగంగా నిందితులను విచారించగా రాజస్థాన్ నుంచి మహారాష్ట్ర మీదుగా అల్ప్రాజోలం రాష్ట్రానికి తీసుకు వస్తున్నట్లు గుర్తించామన్నారు. దానిని చిన్న మొత్తాలలో వివిధ మార్గాల ద్వారా నిజామాబాద్, నిర్మల్ ప్రాంతాలకు అక్రమంగా తరలించి, స్థానికంగా మాదకద్రవ్యానికి డిమాండ్ ఉన్న వ్యక్తులకు సుమారు కిలోకు రూ.4 లక్షల నుండి రూ.5 లక్షల వరకు విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో తేలిందన్నారు.
Alprazolam Drug Case | అక్రమంగా సంపాదించిన ఆస్తుల జప్తు
డ్రగ్స్ డబ్బుతో కూడగట్టిన రూ.3.2 కోట్ల ఆస్తులను జప్తు చేసినట్లు సీపీ తెలిపారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాలో నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు, వారు డ్రగ్స్ అక్రమ వ్యాపారం ద్వారా సంపాదించిన ఆస్తులను గుర్తించి, చట్టప్రకారం జప్తు/అటాచ్మెంట్ చర్యలు చేపట్టడంపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారన్నారు. ఈ క్రమంలో నిజామాబాద్ , నిర్మల్, మహబూబ్నగర్ జిల్లాల్లోని సంబంధిత సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు, తహశీల్దార్ కార్యాలయాలను సంప్రదించి నిందితులు, వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన స్థిర, చర ఆస్తుల వివరాలను సేకరించామన్నారు. దర్యాప్తులో గంధం శ్రీనివాస్ గౌడ్ కుటుంబ సభ్యులు, బొట్ల కాటమయ్య గౌడ్ అల్ప్రాజోలం అక్రమ విక్రయాల ద్వారా సంపాదించినట్లు అనుమానిస్తున్న ఆస్తులను గుర్తించారు. ప్రభుత్వ విలువల ప్రకారం సుమారు రూ రూ.3.02 కోట్ల ఆస్తులను గుర్తించగా, బహిరంగ మార్కెట్లో వాటి విలువ ఎన్నోరేట్లు ఎక్కువగా ఉంటుందన్నారు. ఈ కేసును ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన రూరల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ సంబంధిత పోలీసు సిబ్బందిని కమిషనర్ సాయి చైతన్య ప్రశంసించారు.
ఇది కూడా చదవండి..: Rice Millers Protest | రైస్ మిల్లులపై ఫిజికల్ వెరిఫికేషన్ ఆపాలి