అక్షరటుడే, వెబ్డెస్క్: Rajnath Singh Statement | భారత సాయుధ దళాల సత్తాపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మరోసారి స్పష్టమైన ప్రకటన చేశారు. పహల్గాం ఉగ్రదాడికి దీటుగా సమాధానం ఇచ్చేందుకు చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor)ను నిలిపివేయడం బలహీనత కాదని, అది భారత వ్యూహాత్మక నిర్ణయమని ఆయన స్పష్టం చేశారు. ఏఎన్ఐ నిర్వహించిన ‘నేషనల్ సెక్యూరిటీ సమ్మిట్ 2.0’లో పాల్గొన్న ఆయన, సరిహద్దు భద్రతపై కీలక అంశాలను పంచుకున్నారు.
Rajnath Singh Statement | నిబంధనల ప్రకారమే:
ఆపరేషన్ సిందూర్ కేవలం భారత త్రివిధ దళాల సమన్వయానికి ఒక నిదర్శనమని రాజ్నాథ్ పేర్కొన్నారు. “ఈ ఆపరేషన్ను మనమే ప్రారంభించాం.. మనకు నచ్చిన సమయానికే ముగించాం. ఎవరి ఒత్తిడికో తలొగ్గి ఆపేయలేదు. సామర్థ్యం లేక అస్సలు కాదు. భారత సైన్యం ఎప్పుడూ తన నిబంధనల ప్రకారమే నడుచుకుంటుంది. అవసరమైతే దేశ రక్షణ కోసం సుదీర్ఘ కాలం యుద్ధం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం” అని శత్రువులను హెచ్చరించారు.
Rajnath Singh Statement | ఇంటర్నేషనల్ టెర్రరిజం’కు కేరాఫ్ అడ్రస్గా :
ఈ సందర్భంగా పాకిస్థాన్ (Pakistan) తీరుపై రాజ్నాథ్ సింగ్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. పాక్ను అంతర్జాతీయ ఉగ్రవాదానికి కేంద్ర బిందువుగా ఆయన అభివర్ణించారు. ఉగ్రవాదం కేవలం ఒక దేశ భద్రతా సమస్య మాత్రమే కాదని, అది మానవత్వానికే పెద్ద శాపమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భారత్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) హబ్గా గుర్తింపు పొందుతుంటే, పాకిస్థాన్ మాత్రం ‘ఇంటర్నేషనల్ టెర్రరిజం’కు కేరాఫ్ అడ్రస్గా మారిందని ఎద్దేవా చేశారు.
Rajnath Singh Statement | పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యం:
ఉగ్రవాదం బహుముఖ కోణాల్లో విస్తరిస్తోందని, దీనిని పూర్తిగా నిర్మూలించడమే తమ లక్ష్యమని రాజ్నాథ్ అన్నారు. దేశ వ్యతిరేక శక్తులపై పోరాటం కేవలం సరిహద్దులకే పరిమితం కాదని, మానవ విలువలను కాపాడటమే తమ ప్రాధాన్యత అని ఆయన స్పష్టం చేశారు. పాక్ ఎంతకాలం ఉగ్రవాదానికి మద్దతిచ్చినా, భారత్ మాత్రం తన రక్షణ విషయంలో ఎక్కడా తగ్గబోదని ఆయన తేల్చి చెప్పారు.
ఇది కూడా చదవండి..: Nepal Airlines Map | తప్పుడు మ్యాప్ వివాదం.. తలవంచిన నేపాల్ ఎయిర్లైన్స్!

