MS Dhoni IPL | ఫిట్‌గానే ఉన్న‌ ధోనీ స్టేడియంకు కూడా ఎందుకు రావడం లేదు?.. అసలు కారణం చెప్పిన మైక్ హస్సీ

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : MS Dhoni IPL | ఐపీఎల్ 2026 (IPL 2026) సీజన్ ప్రారంభమై నెల రోజులు గడిచినా, చెన్నై సూప‌ర్ కింగ్స్ అభిమానులు మాత్రం తమ అభిమాన క్రికెటర్ ఎంఎస్ ధోని కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ధోనీ మైదానంలో ఎప్పుడు కనిపిస్తారో అన్న ప్రశ్నకు తాజాగా సీఎస్కే బ్యాటింగ్ కోచ్ మైక్ హ‌స్సీ (Coach Mike Hussey) కీలక వివరణ ఇచ్చారు.

సాధారణంగా జట్టులో సభ్యుడు మ్యాచ్ ఆడకపోయినా స్టేడియంలో ఉండి ఆటగాళ్లకు మద్దతు ఇస్తుంటారు. కానీ ధోనీ మాత్రం భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ప్రాక్టీస్ సెషన్లలో చురుగ్గా పాల్గొంటున్నప్పటికీ, మ్యాచ్ రోజున స్టేడియంలో కనిపించకపోవడం అభిమానుల్లో అనేక సందేహాలకు దారితీసింది.ఈ విషయంపై మైక్ హస్సీ స్పందిస్తూ ఆసక్తికరమైన కారణాన్ని వెల్లడించారు.

MS Dhoni IPL | అందుకే రావ‌డం లేదు..

ధోనీ ఎప్పుడూ జట్టు ప్రయోజనాల కోస‌మే పాటుప‌డుతుంటారు. ఆయన స్టేడియంకు వస్తే అందరి దృష్టి ఆయనపైనే ఉంటుంది. ప్రేక్షకుల అరుపులు, కెమెరా ఫోకస్ మొత్తం ఆయనపైనే ఉండటం వల్ల మైదానంలో ఆడుతున్న ఆటగాళ్ల ఏకాగ్రత దెబ్బతినే అవకాశం ఉంది. జట్టు దృష్టి మళ్లకూడదనే ఉద్దేశంతోనే ఆయన మ్యాచ్ రోజున స్టేడియంకు రాకూడదని నిర్ణయించుకున్నారు” అని హస్సీ తెలిపారు. ధోనీ స్టేడియంలో లేకపోయినా, ప్రతి మ్యాచ్‌ను ఇంటి నుంచే నిశితంగా గమనిస్తున్నారని హస్సీ చెప్పారు. డ్రెస్సింగ్ రూమ్‌లో ధోనీ ఉంటే యువ ఆటగాళ్లకు ఎంతో ధైర్యం కలుగుతుందని, తన అనుభవంతో వారికి మార్గనిర్దేశనం చేస్తుంటారని వివరించారు. ప్రాక్టీస్ సమయంలో ఆటగాళ్లతో కలిసి ఉంటూ సూచనలు ఇస్తున్నారని తెలిపారు.

MS Dhoni IPL | ధోనీ రీ-ఎంట్రీపై కూడా హస్సీ క్లారిటీ

ఇక ధోనీ రీ-ఎంట్రీపై కూడా హస్సీ క్లారిటీ ఇచ్చారు. సీజన్ ప్రారంభంలో పిక్క కండరాల గాయం కారణంగా ధోనీ కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యారని, అయితే ప్రస్తుతం ఆయన కోలుకునే ప్రక్రియ వేగంగా సాగుతోందని చెప్పారు. ముఖ్యంగా వికెట్ల మధ్య పరుగులు తీసే సామర్థ్యాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టారని పేర్కొన్నారు.బ్యాటింగ్, వికెట్ కీపింగ్ (Wicket Keeping) విషయంలో ధోనీ పూర్తిగా సిద్ధంగా ఉన్నారని, త్వరలోనే మైదానంలోకి దిగే అవకాశం ఉందని హస్సీ ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే మ్యాచ్ లేదా ఆ తర్వాత మ్యాచ్‌లో ధోనీని అభిమానులు చూసే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చారు.మొత్తానికి ధోనీ స్టేడియంకు రాకపోవడం వెనుక ఉన్న అసలు కారణం తెలిసిన తర్వాత అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఇప్పుడు అందరి చూపు తలా రీ-ఎంట్రీపైనే నిలిచింది.

ఇది కూడా చదవండి..: Sri Lanka U19 Cricketers Arrested | శ్రీలంక అండర్-19 క్రికెట్‌లో కలకలం.. మ‌హిళ‌లు స్నానం చేస్తుండ‌గా, వీడియోలు తీసిన క్రికెట‌ర్స్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *