PM Modi | బీజేపీకి ఇది చారిత్రాత్మక రోజు : ప్రధాని మోదీ

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : PM Modi | పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో బీజేపీ విజయంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారు. కార్యకర్తల కృషితో ఈ విజయం సాధ్యమైందన్నారు.

ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి సోమవారం సాయంత్రం ప్రధాని చేరుకున్నారు. మోదీకి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్​ నబీన్​ స్వాగతం పలికారు. నబిన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని పూలమాలతో సత్కరించడానికి ముందుకు రాగా, ప్రధాని మోదీ ఆ మాలను తీసుకుని, దానికి బదులుగా నితిన్ నబిన్‌కే మాల వేశారు. కేంద్ర మంత్రులు అమిత్​ షా, రాజ్​నాథ్​ సింగ్​, జేపీ నడ్డా పాల్గొన్నారు. జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వచ్చిన ఎన్నికల్లో నబిన్​ మూడు చోట్ల బీజేపీని గెలిపించడం గమనార్హం

PM Modi | కల ఫలించింది

ప్రధాని మోదీ “భారత్ మాతా కీ జై” అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలకు ఆయన అభినందనలు తెలిపారు. కార్యకర్తల సుదీర్ఘ శ్రమ, కల ఫలించాయని తెలిపారు. బీజేపీని గెలిపించింది కార్యకర్తలే అన్నారు. ప్రజలకు నిజమైన భరోసా ఇచ్చిన రోజు ఇదన్నారు. నేడు భారత రాజ్యాంగం గెలిచిందని పేర్కొన్నారు. ఏళ్ల తరబడి చేసిన కృషి విజయంగా పరిణమించినప్పుడు ప్రజల ముఖాల్లో కనిపించే ఆనందం ఏదైతే ఉందో, సరిగ్గా అదే ఆనందాన్ని ఈ రోజు దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ కార్యకర్తల ముఖాల్లో తాను చూస్తున్నట్లు చెప్పారు.

PM Modi | కమలాన్ని వికసింపజేశారు

బెంగాల్, అసోం, పుదుచ్చేరి, తమిళనాడు, కేరళం ప్రజలకు మోదీ నమస్కరించారు. ప్రతి బీజేపీ కార్యకర్త మరోసారి అద్భుతాలు సృష్టించారని కొనియాడారు. వారు కమలాన్ని వికసింపజేశారన్నారు. BJP అధ్యక్షుడు నితిన్ నబిన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగిన మొట్టమొదటి అసెంబ్లీ ఎన్నికలు ఇవే అన్నారు. ఈ ఎన్నికల సమయంలో ప్రతి పార్టీ కార్యకర్తకు అందించిన మార్గదర్శకత్వం, ఈ విజయంలో అమూల్యమైన పాత్ర పోషించిందని కొనియాడారు. బెంగాల్​ ఓటర్లు కొత్త రికార్డు సృష్టించారన్నారు. తమ పార్టీ అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ప్రజలు పట్టం కట్టారని తెలిపారు.

PM Modi | గంగోత్రి నుంచి..

ఈ రోజు భారతదేశ ప్రజాస్వామ్యంతో పాటు రాజ్యాంగం కూడా గెలిచిందన్నారు. బెంగాల్‌లో దాదాపు 93 శాతం ఓటింగ్ జరగడం చారిత్రాత్మకం అని పేర్కొన్నారు. ఎన్నికల సంఘానికి, ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్న ప్రజలకు, భద్రతా దళాలకు అభినందనలు తెలిపారు. గత సంవత్సరం నవంబర్ 14న బీహార్ ఎన్నికల ఫలితాలు ప్రకటించినప్పుడు, గంగానది బీహార్ దాటి గంగాసాగర్ వరకు ప్రవహిస్తుందని తాను చెప్పినట్లు గుర్తుచేశారు. ఈ రోజు బెంగాల్ విజయంతో గంగోత్రి నుంచి గంగాసాగర్ వరకు కమలం వికసించిందన్నారు. ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, బీహార్, ఇప్పుడు పశ్చిమ బెంగాల్​లో బీజేపీ గెలిచిందని ప్రధాని తెలిపారు. ఈ రోజు బెంగాల్​ భయం నుంచి విముక్తి అయిందని పేర్కొన్నారు.

PM Modi | చొరబాటుదారులపై కఠిన వైఖరి

చొరబాటుదారుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని ప్రధాని స్పష్టం చేశారు. ఈ రోజు నుంచి బెంగాల్ భయం నుండి విముక్తి పొందిందని, అది అభివృద్ధిపై విశ్వాసంతో నిండి ఉందన్నారు. దృష్టి ప్రతీకారంపై కాకుండా మార్పుపై ఉండాలన్నారు. భయంపై కాకుండా భవిష్యత్తుపై శ్రద్ధ పెట్టాలని సూచించారు.

PM Modi | దక్షిణ భారత్​లో..

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో దక్షిణ భారతదేశం కూడా బీజేపీ వికసిస్తుందన్నారు. నేటి ఎన్నికల ఫలితాల తర్వాత అవిశ్రాంతంగా పనిచేసిన కార్యకర్తలందరికీ, అగ్ర నాయకత్వానికి అభినందనలు తెలిపారు. ఈరోజు వారి కఠోర శ్రమ ఫలించిందన్నారు. ఎన్నో పోరాటాల తర్వాత ఈ విజయం దక్కిందని పేర్కొన్నారు. తృణమూల్ ప్రభుత్వం, వామపక్షాలు నియంతృత్వ వైఖరితో పశ్చిమ బెంగాల్ ప్రజలను హింసాత్మక వాతావరణంలో ఉంచి, పూర్తి భయాందోళనను సృష్టించాయని విమర్శించారు. ఈ ఫలితాలు, దేశ ప్రజలు ప్రధాని మోదీ నాయకత్వాన్ని విశ్వసిస్తున్నారని నిరూపించాయి అన్నారు.

ఇది కూడా చదవండి : BJP Bengal Victory | బెంగాల్ గడ్డపై కమల వికాసం.. వైరల్ అవుతున్న బీజేపీ ‘విక్టరీ మ్యాప్’!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *