అక్షరటుడే, వెబ్డెస్క్ : BJP Leader Rally | పెట్రోల్, డీజిల్ ఆదా చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఇటీవల ప్రజలను కోరిన విషయం తెలిసిందే. విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడుకోవాలని ఆయన సూచించారు. ఈ మేరకు స్వయంగా తన కాన్వాయ్లో కార్ల సంఖ్యను సైతం తగ్గించారు. అయితే ప్రధాని వ్యాఖ్యలన ఓ బీజేపీ నేత పట్టించుకోలేదు.
ఏకంగా 50 కార్లతో ర్యాలీ తీశారు.మధ్యప్రదేశ్ (Madhya Pradesh)కు చెందిన ఒక బీజేపీ నాయకుడు దాదాపు 50 వాహనాలతో కూడిన కాన్వాయ్లో ప్రయాణించి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. మధ్యప్రదేశ్ టెక్స్ట్బుక్ కార్పొరేషన్కు కొత్తగా నియమితులైన చైర్మన్ సౌభాగ్య సింగ్ ఠాకూర్ బాధ్యతలు స్వీకరించడానికి వెళ్తూ మద్దతుదారుల వాహనాలతో కలిసి ఉజ్జయిన్ నుండి భోపాల్కు ప్రయాణించారు. మద్దతుదారులు ఠాకూర్కు స్వాగతం పలకడానికి పలుచోట్ల ఆగుతుండగా, ఆ కాన్వాయ్ హైవే పొడవునా విస్తరించి ఉన్నట్లు కనిపించింది. పదేపదే కాన్వాయ్ ఆగడంతో అనేక చోట్ల ట్రాఫిక్కు అంతరాయం కలిగించి, ప్రయాణికులకు అసౌకర్యం కలిగించినట్లు సమాచారం.
BJP Leader Rally | తీవ్ర విమర్శలు
పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంక్షోభం, దాని వల్ల భారత ఆర్థిక వ్యవస్థపై పడగల ఒత్తిడి దృష్ట్యా పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించుకోవాలని ప్రధాని మోదీ ప్రజలకు బహిరంగంగా విజ్ఞప్తి చేసిన కేవలం రెండు రోజులకే ఈ దృశ్యాలు వెలుగులోకి రావడంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇంధన పొదుపుపై ప్రధాని చేసిన బహిరంగ విజ్ఞప్తిని ఆయన సొంత పార్టీలోని నాయకులే పాటిస్తున్నారా లేదా అనే ప్రశ్నలను బీజేపీ నాయకుడి భారీ కాన్వాయ్ లేవనెత్తింది.
ఇది కూడా చదవండి..: UAE Indian Billionaires | యూఏఈ బిలియనీర్లలో మనోళ్ల అధికం.. 17 మందిలో 9 మంది భారతీయులే!

