అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Rice Mill Inspection | అకాలవర్షాల నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని వెంటనే రైస్మిల్లులకు తరలించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆమె బుధవారం రైస్మిల్లులలో ఆకస్మికంగా తనిఖీలు చేశారు. లారీల రాకపోకలు.. మిల్లింగ్ విధానాన్ని పరిశీలించి అధికారుల నుంచి వివరాలు రాబట్టారు.
Rice Mill Inspection | మిల్లుల్లో తరుగు తీస్తున్నారా..?
ఖానాపూర్ (Khanapur)లోని లక్ష్మీ బాలాజీ రైస్ మిల్, శ్రీ సిద్ధి రామేశ్వర ప్రైవేట్ లిమిటెడ్ మిల్లులను కలెక్టర్ సందర్శించారు. మిల్లులకు కొనుగోలు కేంద్రాల నుంచి ఎన్ని లారీల ధాన్యం పంపించారు.. వాటిని దిగుమతి చేసుకున్నారా.. ఎంత పరిమాణంలో మిల్లింగ్ జరిపారానే విషయాలను తెలుసుకున్నారు. మిల్లింగ్ చేసిన బియ్యాన్ని ఎలా భద్రపరుస్తున్నారనే అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మిల్లుల వద్ద ఏమైనా తరుగు తీస్తున్నారా అని కలెక్టర్ ఆరా తీశారు. ఎక్కువగా ఏ రకం ధాన్యం వస్తోందని విచారణ చేశారు.
Rice Mill Inspection | త్వరగా ధాన్యాన్ని దిగుమతి చేసుకోవాలి
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ధాన్యాన్ని వెంటదివెంట దిగుమతి చేసుకోవాలని మిల్లర్లకు కలెక్టర్ సూచించారు. ధాన్యం నిల్వలను సకాలంలో దించుకోకపోతే వర్షాల వల్ల తడిచిపోయే ప్రమాదం ఉంటుందన్నారు. అవసరమైతే ఎక్కువ సంఖ్యలో హమాలీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సామర్ధ్యం మేరకు పూర్తి స్థాయిలో మిల్లింగ్ చేయాలని హితవు పలికారు. ధాన్యం నిల్వలు, మిల్లింగ్ చేసిన బియ్యాన్ని జాగ్రత్తగా భద్రపర్చాలని సూచించారు. ధాన్యం నిల్వ చేసేందుకు సమీపంలోని రైతు వేదికలను వినియోగించుకోవాలని తెలిపారు. మిల్లుల వద్ద ధాన్యం నిల్వలను దిగుమతి చేసుకునే విషయంలో జాప్యానికి తావులేకుండా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట డీఎస్వో శ్రీకాంత్ రెడ్డి, సివిల్ సప్లయ్స్ డీఎం ప్రవీణ్, రైస్ మిల్లుల నిర్వాహకులు మోహన్ రెడ్డి, శ్రవణ్ కుమార్ తదితరులున్నారు.
ఇది కూడా చదవండి..: Paddy Transport Inspections | లారీలను కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్న అధికారులు

