అక్షరటుడే, వెబ్డెస్క్: Chinthala Pati Madhu | సూర్యాపేట Suryapet జిల్లా కేంద్రంలో అత్యంత కిరాతకమైన ఉదంతం వెలుగుచూసింది. స్థానిక బీఆర్ఎస్ నాయకుడు చింతలపాటి మధు (మధుసూదన్ రాజు) దారుణ హత్యకు గురయ్యారు.
ఆయనను దుండగులు అత్యంత అమానుషంగా మూడు ముక్కలుగా నరికి, గోనె సంచిలో కుక్కి, జిల్లా కేంద్రంలోని యార్కారం గ్రామం సమీపంలో ఉన్న ఎస్సారెస్పీ (SRSP) కాలువలో పడేసిన ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలను కలిగించింది.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ దారుణ హత్య వెనుక రాజకీయ విభేదాలు ఉన్నాయా..? లేక వ్యక్తిగత కక్షలే కారణమా? అనే కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Chinthala Pati Madhu | ఎదుగుదలను ఓర్వలేకేనా?
చింతలపాటి మధు బీఆర్ఎస్ పార్టీలో చురుకైన నాయకుడిగా గుర్తింపు పొందారు. స్థానిక రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తూ, ప్రజల్లో మంచి పట్టు సాధించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు.
జిల్లా కేంద్రం పరిధితోపాటు యార్కారం పరిసర ప్రాంతాలలో మధు రాజకీయంగా పుంజుకోవడం కొంతమంది ప్రత్యర్థులకు మింగుడుపడలేదనే చర్చ నడుస్తోంది.
స్థానిక సంస్థల సమీకరణాలు, పార్టీలోని అంతర్గత విభేదాలు లేదా ప్రత్యర్థి పార్టీల శ్రేణులతో ఉన్న పాత గొడవలు ఈ హత్యకు దారితీసి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మధును రాజకీయంగా తొక్కేయడానికే పక్కా స్కెచ్తో ఈ ఘాతుకానికి ఒడిగట్టారా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
Chinthala Pati Madhu | వ్యక్తిగత, ఆర్థిక, భూ వివాదాలు ఉన్నాయా?
రాజకీయాలతో పాటు ఈ హత్య వెనుక బలమైన వ్యక్తిగత కారణాలు కూడా ఉండి ఉంటాయని స్థానికులు అనుమానిస్తున్నారు.
రియల్ ఎస్టేట్ వివాదాలు గానీ, పెద్ద మొత్తంలో జరిగిన ఆర్థిక లావాదేవీల వల్ల వచ్చిన మనస్పర్థలు గానీ ఈ హత్యకు కారణం కావచ్చని భావిస్తున్నారు. వ్యక్తిగత బంధాలపైనా దృష్టి సారిస్తున్నారు.
నిందితులు మధుపై ఉన్న వ్యక్తిగత కోపాన్ని, కక్షను మనసులో పెట్టుకుని, ఒంటరిగా దొరికిన సమయంలో మాటు వేసి దాడి చేసి ఉంటారని తెలుస్తోంది.
శవాన్ని గుర్తుపట్టకుండా మూడు ముక్కలుగా నరికి, గోనె సంచిలో కట్టి కాలువలో పడేయడం చూస్తుంటే.. నిందితులకు మధుపై ఎంతటి తీవ్రమైన పగ ఉందో అర్థమవుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Chinthala Pati Madhu | నిందితుల కోసం గాలింపు
ఎస్సారెస్పీ కాలువలో లభ్యమైన మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగి ఆధారాలు సేకరిస్తున్నాయి. మధు మొబైల్ ఫోన్ డేటా, చివరిగా ఆయన ఎవరెవరిని కలిశారు? ఎస్సారెస్పీ కాలువ పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
బీఆర్ఎస్ నాయకుడిని ఇంత దారుణంగా హత్య చేయడంపై సూర్యాపేట జిల్లా రాజకీయ శ్రేణులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి.
శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా పోలీసులు యార్కారం, సూర్యాపేట పరిసర ప్రాంతాలలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని, త్వరలోనే కేసును ఛేదిస్తామని పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.


