అక్షరటుడే, వెబ్డెస్క్: Adulterated Spices | హైదరాబాద్ నగరంలో 25 టన్నుల కల్తీ మసాలాలను హెచ్–ఫాస్ట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు మంగళవారం నగర కమిషనర్ సజ్జనార్ (CP Sajjanar) వివరాలు వెల్లడించారు.
నగరంలో కల్తీ మాఫియా రెచ్చిపోతుంది. అనేక రకాల ఆహార పదర్థాలను కల్తీ చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. కల్తీ దందా చేసే వారి ఆట కట్టించడానికి నగర పోలీసులు హెచ్–ఫాస్ట్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఈ టీమ్ ఆధ్వర్యంలో 13 మసాలా తయారీ కేంద్రాలపై మెరుపు దాడులు చేసినట్లు సీపీ సజ్జనార్ తెలిపారు. ప్రజలు ఇచ్చిన సమాచారం మేరకు ఈ తనిఖీలు చేశామన్నారు. ఇందులో 25 టన్నులకుపైగా కల్తీ మసాలాలు స్వాధీనం చేసుకున్నామని ఆయన వెల్లడించారు.
Adulterated Spices | ముగ్గురి అరెస్ట్
కల్తీ మసాలాలు తయారు చేస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మైలార్దేవ్పల్లి, బాలాపూర్ పోలీస్ స్టేషన్లలో మూడు కేసులు నమోదు అయ్యాయని సీపీ పేర్కొన్నారు. వాము, జీలకర్ర, లవంగం, షాజీరా, ఆవాలు సహా పలు మసాలాల్లో కల్తీ చేసినట్లు గుర్తించారు. ఫ్యాబ్రిక్ డైలు, సింథటిక్ కలర్స్తో మసాలాలు తయారు చేస్తున్నారని వెలలడించారు. టాల్కమ్ పౌడర్, ఇండస్ట్రీయల్ డైలు, రైస్ బ్రాన్ ఆయిల్ వినియోగిస్తున్నట్లు గుర్తించారు. రంగులు వేసి నాణ్యమైన మసాలాల మాదిరిగా మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఈ దాడుల్లో 89 టన్నులకుపైగా ముడి పదార్థాలు స్వాధీనం చేసుకున్నామని సజ్జనార్ వెల్లడించారు. కల్తీ మసాలాలతో క్యాన్సర్, అలర్జీలు, జీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదమని ఆయన హెచ్చరించారు.
ఇది కూడా చదవండి..: HYDRAA | హైడ్రా ప్రజలను వేధించే సంస్థ : ఎంపీ ఈటల రాజేందర్