అక్షరటుడే, వెబ్డెస్క్: Amaravati Development | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే మంత్రివర్గ సమావేశం ఈరోజు ఉదయం 10.30 గంటలకు వెలగపూడి సచివాలయంలో జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో రాజధాని అమరావతి అభివృద్ధి ప్రధాన అజెండాగా ఉండనుంది.
గతంలో నిలిచిపోయిన నిర్మాణ పనులను మళ్లీ ప్రారంభించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ముఖ్యంగా పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో భారీ ప్రాజెక్టులకు ఆమోదం ఇవ్వడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలో అమరావతి క్వాంటం వ్యాలీ (Amaravati Quantum Valley)లో నిర్మించనున్న జంట గోపురాల ప్రాజెక్ట్ కీలకంగా నిలుస్తోంది. సుమారు రూ.1,208.41 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది.
Amaravati Development | అభివృద్ధిపై నిర్ణయాలు..
ఇదే కాకుండా సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల గోపురాలకు సంబంధించిన ముఖభాగం, అద్దపు పనులకు రూ.2,540 కోట్ల ఖర్చు ప్రతిపాదన కూడా సమావేశంలో పరిశీలనకు రానుంది. అలాగే అసెంబ్లీ భవన నిర్మాణానికి రూ.798 కోట్ల వ్యయానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలపై కూడా కీలక చర్చ జరగనుంది. భూసమీకరణలో భాగంగా తమ భూములు ఇచ్చిన రైతులకు కౌలు పెంపుపై మంత్రివర్గం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మెట్ట భూమికి సంవత్సరానికి రూ.40,000, జరీబు భూమికి రూ.60,000 చొప్పున కౌలు పెంచే ప్రతిపాదనపై చర్చించి ఆమోదం తెలపవచ్చని తెలుస్తోంది.
అలాగే పలు విద్యా, ఆర్థిక సంస్థలకు భూముల కేటాయింపులపై కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలు అమరావతి అభివృద్ధికి కొత్త దిశను చూపుతాయని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.ఈ భేటిపై అందరి దృష్టి నెలకొని ఉంది.
ఇది కూడా చదవండి..: TDP Working President | టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేశ్ ప్రమాణం

