అక్షరటుడే, వెబ్డెస్క్ : AP Fuel Crisis | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో పెట్రోల్, డీజిల్ సంక్షోభం క్రమంగా తీవ్రతరమవుతోంది. విజయవాడ, రాజమండ్రి, ఏలూరు, గుంటూరు, తిరుపతి వంటి ప్రధాన నగరాల్లో పలు పెట్రోల్ బంకులు మూతపడుతున్నాయి. అనేక ప్రాంతాల్లో ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి.
కొద్ది బంకుల్లో మాత్రమే ఇంధనం లభ్యమవుతుండడంతో వాహనదారులు భారీ క్యూల్లో నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది.ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల వల్ల వాహనదారులతో పాటు రైతులు (Farmers) కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యవసాయ పనులకు డీజిల్ కీలకం కావడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇంధనం దొరకకపోవడం వల్ల రవాణా వ్యవస్థపైనా ప్రభావం పడుతోంది.
AP Fuel Crisis | అదనపు ఒత్తిడి..
ఏపీ ఫెడరేషన్ ఆఫ్ పెట్రోల్ అండ్ ట్రేడర్స్ అసోసియేషన్ ప్రతినిధుల ప్రకారం, ఆయిల్ కంపెనీలు డీలర్లకు సరఫరా చేసే కోటాను గణనీయంగా తగ్గించాయి. అదేవిధంగా రియల్స్, నయారా వంటి ప్రైవేట్ సంస్థలు తమ అవుట్లెట్లకు సరఫరాను నిలిపివేయడం వల్ల ప్రభుత్వ రంగ బంకులపై అదనపు ఒత్తిడి పడింది. ఇంధనం దొరకదనే భయంతో వాహనదారులు ఒకేసారి ఎక్కువ మొత్తంలో నిల్వ చేసుకోవడానికి ప్రయత్నించడం వల్ల డిమాండ్ ఒక్కసారిగా పెరిగిందని అధికారులు చెబుతున్నారు. ఈ ప్యానిక్ బయ్యింగ్ కారణంగా కొరత మరింత తీవ్రమైనదిగా మారిందని పేర్కొంటున్నారు.
ఇక తిరుపతి (Tirupati)లో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. పట్టణంతో పాటు మండల, గ్రామీణ ప్రాంతాల్లో కూడా పలు బంకులు మూతపడుతున్నాయి. ఈ నేపథ్యంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ క్లిష్ట సమయంలో తిరుపతిలోని ఓ పెట్రోల్ బంకు యాజమాన్యం ముందుకు వచ్చి ప్రత్యేక నిర్ణయం తీసుకుంది. తనపల్లి రోడ్డు (Tanapalli Road)లోని ఐఓసీఎల్ బంకులో ద్విచక్ర వాహనదారులకు ఉచితంగా ఒక లీటర్ పెట్రోల్ పంపిణీ చేస్తున్నారు. రొమ్మల రాజేష్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ సేవ కొనసాగుతోంది. బంకు యజమాని రాజేష్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజల్లో భయాందోళనలు తగ్గేవరకు తమకు చెందిన రెండు బంకుల్లో ఉచితంగా పెట్రోల్ అందిస్తామని తెలిపారు. బంకుల్లో నిల్వ ఉన్నంత వరకు ప్రజలు ఇబ్బందులు పడకుండా సహాయం చేస్తామని చెప్పారు. ఈ ఉచిత పంపిణీ వార్త తెలిసిన వెంటనే ద్విచక్ర వాహనదారులు పెద్ద సంఖ్యలో బంకు వద్దకు చేరుకుని క్యూలు కడుతున్నారు.
ఇది కూడా చదవండి..: Fuel Shortage | తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ కొరత

