అక్షరటుడే, వెబ్డెస్క్: Atal Pension Yojana | కేంద్ర ప్రభుత్వం అందిస్తోన్న సోషల్ సెక్యూరిటీ పథకాల్లో ఒకటైన అటల్ పెన్షన్ యోజన చారిత్రక మైలురాయిని తాకింది. ఏప్రిల్ 21 నాటికి ఈ పెన్షన్ పథకంలో చేరిన వారి సంఖ్య 9 కోట్లు దాటారు. ఒక్క 2025-26 ఆర్థిక సంవత్సరంలోనే 1.35 కోట్ల మంది కొత్త చందాదారులు చేరడం గమనార్హం.
2015లో ప్రారంభమైన ఈ పథకం.. అసంఘటిత రంగ కార్మికులు, రైతులు (Farmers), నిర్మాణ రంగ కార్మికులకు వరంలాంటిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మలి వయసులో ఇతరులపై ఆధారపడకుండా ఈ పథకం ఆర్థిక భరోసా కల్పిస్తుంది.అందుకే ఈ పథకంలో చేరడానికి చాలామంది ఉత్సాహం చూపుతున్నారు. ఈ స్కీమ్లో ఎలా చేరాలి, ఎంత ప్రీమియం చెల్లిస్తే గరిష్టంగా ఎంత పెన్షన్ పొందడానికి అవకాశం ఉంటుంది అన్న వివరాలు తెలుసుకుందామా..
Atal Pension Yojana | ఎంత మొత్తం అందుతుందంటే..
కేంద్ర ప్రభుత్వం (Central Government) అమలు చేస్తున్న సామాజిక భద్రత పథకాల్లో అటల్ పెన్షన్ యోజన ఒకటి. 2015లో ఈ పథకాన్ని ప్రకటించారు. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ(పీఎఫ్ ఆర్ డీఏ) దీనిని నిర్వహిస్తోంది. ఇది వలంటరీ, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్. ప్రధానంగా పేద, మధ్యతరగతి అసంఘటిత రంగంలోని కార్మికులను లక్ష్యంగా చేసుకుని రూపొందించారు. చాలా తక్కువ పొదుపుతో పదవీ విరమణ తర్వాత నెలనెలా గ్యారంటీ పెన్షన్ పొందేందుకు ఇది దోహదపడుతుంది. అటల్ పెన్షన్ పŸథకంలో చేరినవారు 60 ఏళ్ల తర్వాత వారి పెట్టుబడులకు అనుగుణంగా నిర్ణీత మొత్తాన్ని నెలనెలా పెన్షన్ రూపంలో పొందుతారు. ఈ మొత్తం వెయ్యి రూపాయలనుంచి రూ. 5 వేల వరకు ఉంటుంది.
Atal Pension Yojana | ఎవరు అర్హులంటే..
18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు వ్యక్తులు ఈ పథకంలో చేరొచ్చు. ఇందుకోసం పోస్టాఫీసు, ఏదైనా ప్రభుత్వరంగ బ్యాంక్లో పొదుపు ఖాతా అవసరం. కాగా నేషనల్ పెన్షన్ స్కీమ్, ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చేవారు ఈ పథకానికి అనర్హులు.
Atal Pension Yojana | ఎంత చెల్లించాలంటే..
పెన్షన్ ఎంపిక, వయసును బట్టి ప్రీమియం మారుతూ ఉంటుంది. రూ. 1000 నుంచి రూ. 5 వేల వరకు పెన్షన్ మొత్తం ఉంటుంది. అందుకు అనుగుణంగానే చెల్లింపులు మారుతూ ఉంటాయి. 18 ఏళ్ల వ్యక్తి ఈ పథకాన్ని ఎంచుకుంటే 60 ఏళ్లు వచ్చే వరకు ఈ పథకం కింద కాంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. 18 ఏళ్ల వయసులో పెన్షన్ స్కీమ్లో చేరేవారు.. ఎంచుకునే పెన్షన్ మొత్తాన్ని బట్టి (రూ. వెయ్యి నుంచి రూ. 5 వేలు) ప్రతినెలా రూ. 42 నుంచి గరిష్ఠంగా రూ.210 వరకు చెల్లించాల్సి ఉంటుంది. అదే 40 ఏళ్ల వయసులో చేరితే 20 సంవత్సరాల పాటు కంట్రిబ్యూట్ చేయాలి. వీరు నెలనెలా రూ. 291 నుంచి రూ. 1,454 వరకు చెల్లించాల్సి ఉంటుంది.అకౌంట్ తెరిచేందుకు రూ. 15, యాన్యువల్ మెయింటెనెన్స్ చార్జీలు ఏటా రూ. 15 చొప్పున కట్టాలి. గడిచిన దశాబ్ద కాలంలో చూసుకుంటే మంచి ఆదరణ పొందింది.
ఒకవేళ వరుసగా ఆరు నెలల పాటు తమ వాటా చెల్లించకపోతే సదరు పింఛన్ ఖాతాను స్తంభింపచేస్తారు. 12 నెలల పాటు చెల్లించపోతే ఆ ఖాతాను డీయాక్టివేట్ చేస్తారు. 24 నెలల అనంతరం ఖాతాను మూసివేసి అంతవరకు సేకరించిన మొత్తాన్ని చందాదారుకు అందిస్తారు.అటల్ పెన్షన్ యోజన ద్వారా చందాదారులకు మూడు రకాల ప్రయోజనాలు లభిస్తాయి. నిర్ణీత వయసు దాటాక పెన్షన్ లభించడంతో పాటు, ఒకవేళ చందాదారు మరణిస్తే జీవిత భాగస్వామికి పెన్షన్ బదిలీ అవుతుంది. వారిద్దరూ మరణిస్తే నామినీకి రిటైర్మెంట్ కార్పస్ ఫండ్ అందుతుంది. వెయ్యి పెన్షన్ ఎంచుకుంటే రూ. 1.7 లక్షలు, రూ. 2 వేలకు రూ. 3.4 లక్షలు, రూ. 5వేలకు రూ. 8.5 లక్షల కార్పస్ మొత్తం అందిస్తారు.
Atal Pension Yojana | దరఖాస్తు ఇలా :
అన్ని జాతీయ బ్యాంకులతో పాటు పోస్టాఫీసు ద్వారా ఈ పథకంలో చేరొచ్చు. ఆన్లైన్ తోపాటు ఆఫ్లైన్లోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్లైన్లో అయితే బ్యాంక్ శాఖను సంప్రదించాలి. అన్లైన్లో అయితే బ్యాంక్ మొబైల్ యాప్ లేదా ఈఎన్ పీఎస్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆధార్ కార్డు, సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ వివరాలు, మొబైల్ నంబర్, వయసు ధ్రువీకరణ పత్రం, కేవైసీ డాక్యుమెంట్లు అవసరం అవుతాయి.
Atal Pension Yojana | చందాదారు మరణిస్తే..
పాలసీ తీసుకున్న వ్యక్తి 60 సంవత్సరాల కంటే ముందే మరణిస్తే.. ఆ వ్యక్తి ఏపీవై ఖాతా కొనసాగుతుంది. ఈ ఆప్షన్ జీవిత భాగస్వామికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. మరణించిన చందాదారుని వయసు 60 ఏళ్లు దాటే వరకు జీవిత భాగస్వామి పేరుపై ఆ ఖాతాను కొనసాగించవచ్చు. వయసు పరిమితి దాటిన తర్వాత నుంచి మరణం వరకు పెన్షన్ పొందడానికి అవకాశం ఉంటుంది. అదే ఆ ఖాతాను మూసివేయాలనుకుంటే ఏపీవై ఖాతా తీసుకున్న వ్యక్తి పెట్టిన పెట్టుబడిపై వచ్చే వడ్డీ సహా ఏక మొత్తంలో భాగస్వామికి చెల్లిస్తారు. ఒకవేళ మరణించిన వ్యక్తికి వివాహం కాకపోయినా, జీవిత భాగస్వామి నుంచి చట్టబద్ధంగా విడిపోయినా లేదా మరణించినా ఈ ప్రయోజనాలను నామినీకి అందిస్తారు.
ఇది కూడా చదవండి..: India New Zealand FTA | భారత్-న్యూజిలాండ్ వాణిజ్య ఒప్పందం.. 8,284 ఉత్పత్తులపై ఇక జీరో ట్యాక్స్!


[…] […]