అక్షరటుడే, ఇందూరు: Bandaru Ceremony Nizamabad | నగరం (Nizamabad)లో ఊరపండుకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లు ఘనంగా ప్రారంభమయ్యాయి. దీంట్లో భాగంగా ప్రధాన ఘట్టమైన బండారు పోసే కార్యక్రమాన్ని గురువారం భక్తిశ్రద్ధలతో సర్వసమాజ్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు.
Bandaru Ceremony Nizamabad | జోరు వానలో..
ఉదయం నుంచి జోరుగా వాన కురుస్తున్నప్పటికీ సర్వసమాజ్ కమిటీ సమక్షంలో శివాజీ నగర్ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో స్థానిక గాజుల్పేట్, అశోక్ వీధిలో బండారు పోసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వసమాజ్ కమిటీ ముఖ్య సలహాదారుడు, శివాజీ నగర్ మున్నూరుకాపుసంఘం మాజీ అధ్యక్షుడు గాండ్ల లింగం మాట్లాడుతూ ప్రతి ఏడాది ఆషాఢ మాసం ప్రారంభంలో ఊరపండుగ నిర్వహిస్తారన్నారు. దీంట్లో భాగంగా బండారు పోశామని.. ఈ రోజు నుంచి ఆదివారం వరకు ఊరపండుగకు సంబంధించిన కార్యక్రమాలు ప్రారంభమవుతాయన్నారు.

ఊరి పొలిమేర దాటకూడదనే ఆచారం కొనసాగుతోందన్నారు. వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా రోగాలు రాకుండా ఊరిదేవతలకు మొక్కులు చెల్లించుకునే దాంట్లో భాగంగా ఈ ఊరపండుగ జరుపుకుంటామని తెలియజేశారు. గురువారం నుంచి వడ్లధాతిలో దేవతామూర్తులను తయారు చేసే కార్యక్రమం ప్రారంభం అవుతుందన్నారు. ఆదివారం రోజు ఉదయం నుంచి ఊరపండుగ సందర్భంగా దేవతామూర్తులను ఖిల్లా కళాశాల వద్ద గద్దెవద్ద ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మహాలక్ష్మినగర్, దుబ్బ తదితర ప్రాంతాల్లో మూర్తులను ప్రతిష్ఠిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమాలన్నింటిని సర్వసమాజ్ కమిటీ పెద్దల ఆధ్వర్యంలో పకడ్బందీగా నిర్వహిస్తున్నామని వివరించారు. బండారు పోసే కార్యక్రమంలో శివాజీనగర్ మున్నూరుకాపు సంఘం పాలకవర్గం సభ్యులు, డైరెక్టర్లు, పెద్దకాపులు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Kalyana Lakshmi Forgery Case | ‘గెజిటెడ్’ సంతకాల ఫోర్జరీ కేసు.. విచారణపై ఉత్కంఠ!