అక్షరటుడే, కామారెడ్డి: Electric Bus Breakdown |ఇటీవల ఆర్టీసీ (TGSRTC) ఎలక్ట్రిక్ బస్సులు తరచూ మొరాయిస్తున్నాయి. సాంకేతిక సమస్యలతో ఎక్కడపడితే అక్కడ నిలిచిపోతుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Electric Bus Breakdown | కామారెడ్డి నుంచి నిజామాబాద్ వెళ్తుండగా..
కామారెడ్డి(Kamareddy) నుంచి నిజామాబాద్(Nizamabad) వెళ్తున్న ఎలక్ట్రిక్ బస్సు టేక్రియాల్ శివారులో మధ్యలోనే ఆగిపోయింది. దాంతో ఆ బస్సులోని ప్రయాణికులు రోడ్డుపై గంటకు పైగా అవస్థలు పడాల్సి వచ్చింది. స్థానికుల కథనం ప్రకారం.. కామారెడ్డి బస్టాండ్ నుంచి మధ్యాహ్నం బయలుదేరిన టీజీ16 టీ2136 నంబరు గల ఎలక్ట్రిక్ బస్సు నిజామాబాద్ వెళ్తుండగా జాతీయ రహదారి 44పై టేక్రియాల్ వద్దకు చేరుకుంది. అదే సమయంలో బస్సులో అకస్మాత్తుగా సాంకేతిక లోపం తలెత్తింది. డ్రైవర్ ఎంత ప్రయత్నించినా బస్సు ముందుకు కదల్లేదు. దాంతో డ్రైవర్, కండక్టర్ వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. బస్సు రోడ్డు మధ్యలో ఆగడంతో కొంతసేపు ట్రాఫిక్ సమస్య ఏర్పడింది.
బస్సులో ఉన్న మహిళలు, వృద్ధులు, విద్యార్థులు ఎండలో నిలబడి ఇబ్బంది పడ్డారు. విషయం తెలుసుకున్న ఆర్టీసీ అధికారులు వెంటనే కామారెడ్డి డిపో నుంచి ప్రత్యామ్నాయ బస్సును పంపించారు. దాదాపు గంట తర్వాత వచ్చిన ఆ బస్సులో ప్రయాణికులందరినీ ఎక్కించి నిజామాబాద్ కు పంపించారు. ఇటీవల జిల్లాలో ఎలక్ట్రిక్ బస్సులు మధ్యలో నిలిచిపోయిన ఘటనలు పెరుగుతున్నాయి. ఛార్జింగ్ సమస్యలు, బ్యాటరీ టెక్నికల్ ఫాల్ట్లతో ప్రయాణికులు తరచూ ఇబ్బందులు పడుతున్నామని ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ఆర్టీసీ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.
ఇది కూడా చదవండి: జమ్మూకశ్మీర్లోని రాజౌరీ జిల్లాలో ఆకస్మిక వరదల బారిన పడిన ఐదుగురు పిల్లలతో సహా 11 మంది పౌరులను రక్షించిన భారత సైన్యం