అక్షరటుడే, కోటగిరి: Bhagavata Saptaham | పోతంగల్ (Pothangal) మండల కేంద్రంలోని శ్రీ బాలాజీ మందిరంలో జుక్కల్ (jukkal) మఠం సద్గురు గోపాల్ మహారాజ్ రామదాసి ఆధ్వర్యంలో శ్రీమద్భాగవత మహాపురాణ సప్తాహం వైభవంగా కొనసాగుతోంది. మే16వ తేదీన మండల కేంద్రానికి చేరుకున్న గోపాల్ మహారాజ్ దంపతులకు మహిళలు మంగళహారతులతో ఘనంగా స్వాగతం పలికారు.
Bhagavata Saptaham | వారం రోజుల పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు..

వారం రోజుల పాటు సాగే ఈ ఆధ్యాత్మిక వేడుకల్లో భాగంగా నిత్యం ఉదయం, సాయంత్రం సర్వదేవతల అభిషేకాలు, రామదాసు భిక్షాటన, భాగవత ప్రవచనాలు, సంకీర్తనలు, నిరంతర అన్నదానం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గోపాల్ మహారాజ్ మాట్లాడుతూ.. గోపాల్ మహారాజ్ భక్తులనుద్దేశించి ప్రసంగిస్తూ.. ప్రతిఒక్కరూ తల్లిదండ్రులు, గురువులు, గోమాతను గౌరవిస్తూ సనాతన ధర్మాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ‘సమాజంలో ద్వేష భావనలను, కుట్రలను వీడి.. అంతా భారతీయులమనే సద్భావనతో మెలగాలన్నారు. నిష్కల్మషమైన భక్తితో దైవాన్ని స్మరిస్తే ఆ శ్రీరామచంద్రుడు ఆయురారోగ్యాలను, అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడని ఉద్భోదించారు.
Bhagavata Saptaham | బాలాజీ మందిరం పవిత్రం పుణ్యక్షేత్రం..

కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల వేంకటేశ్వర స్వామి, సీతారామచంద్రుల అనుగ్రహం, 22 తరాల రామోపాసనా శక్తి రూపమే బాలాజీ మందిరమని.. భక్తులందరూ భక్తిమార్గంలో పయనించి తరించాలని ఆయన కోరారు. అనంతరం శ్రీకర్ మహారాజ్ తన అనుభవాలను పంచుకుంటూ.. గోపాల్ మహరాజ్ తొమ్మిదేళ్ల వయసులోనే గ్రామాన్ని వదిలి వెళ్లారని.. అనంతరం జుక్కల్లో గోవింద మఠాన్ని ఏర్పాటు చేసుకున్నారన్నారు. తన జన్మస్థలమైన పోతంగల్ గ్రామంలో ఈ భాగవత సప్తాహాన్ని ఆయన పోతంగల్లో నిర్వహించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు.
Bhagavata Saptaham | ఘనంగా శ్రీరామ పట్టాభిషేకం..
అధిక మాసం (పురుషోత్తమ మాసం) పురస్కరించుకుని శుక్రవారం స్వామివారికి వైభవంగా పట్టాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పట్టాభిషేకంలో పాల్గొన్న పురోహితులకు 33 రకాల వస్తువులతో కూడిన దానం చేశారు. శనివారం జరగబోయే ముగింపు ఉత్సవాల్లో భాగంగా ‘లలితా పారాయణం’ (Lalita Parayana) నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. జుక్కల్ మఠం శిష్యులతో పాటు గోపాల్, కేశవ్ నానా, శ్రీకర్ మహారాజ్ పర్యవేక్షణలో జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కమిటీ పేర్కొంది.
ఇది కూడా చదవండి: Telangana Farmers Protest| తక్షణమే ధాన్యాన్ని సేకరించాలి.. కవిత డిమాండ్


