అక్షరటుడే, వెబ్డెస్క్: Bhakta Ramadasu Descendant | భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ నిర్మాణంతో రామభక్తికి చిరస్మరణీయమైన చరిత్రను లిఖించిన మహాభక్తుడు భక్త రామదాసు అలియాస్ కంచర్ల గోపన్న వంశ పరంపర తిరుమల శ్రీవారి సన్నిధికి చేరింది. భక్త రామదాసు పదోతరం వంశీకులు కంచర్ల శ్రీనివాస్ తన కుటుంబ సభ్యులతో కలిసి గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాశ్ రెడ్డి కంచర్ల శ్రీనివాస్ కుటుంబానికి ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం దగ్గరుండి శ్రీవారి దర్శనం చేయించారు. రామభక్తి పరిమళించిన వంశం నుంచి వచ్చిన వారసులు.. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవెంకటేశ్వర స్వామి సన్నిధిలో అడుగుపెట్టడంతో తిరుమల కొండలు మరింత భక్తిరసంతో నిండినట్లయ్యాయి.
Bhakta Ramadasu Descendant | రామభక్తి కోసం జీవితాన్నే అర్పించిన మహాభక్తుడు
దర్శనం అనంతరం కంచర్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. తన పూర్వీకుడు కంచర్ల గోపన్న శ్రీరాముడిపై అచంచలమైన భక్తితో ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొన్నారని గుర్తుచేశారు.
అనేక ఇబ్బందులు పడి, చెరసాల పాలైనా వెనుకడుగు వేయకుండా భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ నిర్మాణానికి తన జీవితాన్ని అంకితం చేశారని తెలిపారు.
భక్త రామదాసు చేసిన ఆధ్యాత్మిక సేవకు ఫలితంగానే నేడు భద్రాచలం రామాలయం కోట్లాది మంది భక్తులకు భక్తి, విశ్వాసాలకు పవిత్ర క్షేత్రంగా నిలిచిందన్నారు.
దేశవ్యాప్తంగా శ్రీరామ నామం మారుమోగుతున్న ఈ తరుణంలో ప్రతి ఒక్కరూ ధర్మం, భక్తి, ఆధ్యాత్మిక విలువలను కాపాడేందుకు ముందుకు రావాలని ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కంకణబద్ధులై పనిచేయాలని పిలుపునిచ్చారు.
Bhakta Ramadasu Descendant | భక్త రామదాసు నుంచి గోవింద దాసు వరకు..
టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ రోజు తన జీవితంలో ఎంతో ఆనందకరమైన, పుణ్యప్రదమైన రోజని అన్నారు. భగవంతుడిపై అచంచలమైన భక్తితో, తన స్వేదాన్ని ధారపోసి శ్రీరామచంద్రమూర్తి కోసం భద్రాచలంలో ఆలయాన్ని నిర్మించిన మహాభక్తుడు భక్త రామదాసు కంచర్ల గోపన్న వంశస్థుడైన కంచర్ల శ్రీనివాస్తో కలిసి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం తనకు అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిందన్నారు.
“భక్త రామదాసు నుంచి గోవింద దాసు వరకు సాగిన ఈ భక్తి పరంపర ఎంతో అపూర్వమైనది” అని ఆయన పేర్కొన్నారు. శ్రీరాముడి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన భక్త రామదాసు ఆధ్యాత్మిక వారసత్వం నుంచి, నేడు గోవింద నామస్మరణతో మారుమోగుతున్న శ్రీవారి సన్నిధికి రావడం ఒక విశిష్టమైన దైవానుభూతిగా అభివర్ణించారు.
Bhakta Ramadasu Descendant | భద్రాచలం నుంచి అయోధ్య వరకు.. తిరుమలలో గోవింద నామస్మరణ
భద్రాచలం నుంచి అయోధ్య వరకు మారుమోగుతున్న శ్రీరామ నామం, తిరుమల కొండలపై ప్రతిధ్వనించే గోవింద నామస్మరణ భారతీయ సనాతన సంస్కృతి, భక్తి వైభవానికి ప్రతీకలని భాను ప్రకాశ్ రెడ్డి అన్నారు.
రామనామం, గోవింద నామం.. రెండు దైవనామాలు ఒకే ఆధ్యాత్మిక ప్రవాహంగా కలిసిన ఈ సందర్భం భక్తులకు హృదయాన్ని పులకింపజేసే దృశ్యంగా నిలిచిందన్నారు.. ఒకవైపు భద్రాచల రాముడి భక్తి వారసత్వం.. మరోవైపు తిరుమల శ్రీవారి దివ్య సన్నిధి.. ఈ రెండు పవిత్ర క్షేత్రాల ఆధ్యాత్మిక అనుబంధం భక్తి పరంపరలో మరో మధుర ఘట్టంగా మారిందని అభివర్ణించారు.
దేశంలో సనాతన ధర్మం నిత్యం విరాజిల్లాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని శ్రీరామచంద్రుడు, శ్రీ వెంకటేశ్వర స్వామిని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నానని భాను ప్రకాశ్ రెడ్డి తెలిపారు.
రామభక్తి నుంచి గోవింద నామస్మరణ వరకు సాగిన ఈ దివ్య సమాగమం.. భక్తి, సంప్రదాయం, ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు.