అక్షరటుడే, వెబ్డెస్క్: Deeksha Success Story | నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన విద్యార్థిని కుంట దీక్ష తన ప్రతిభతో పదో తరగతి ఫలితాల్లో మెరిసి అందరికీ ప్రేరణగా నిలిచింది. 600 మార్కులకు గాను 588 మార్కులు సాధించి జిల్లాలోనే రెండో స్థానం దక్కించుకోవడం ద్వారా తన కృషి, పట్టుదల ఏ స్థాయిలో ఉందో నిరూపించింది.
నగరంలోని కుంట సంజీవ్–రాధిక (Kunta Sanjeev -Radhika) దంపతుల కూతురు కుంట దీక్ష. సుభాష్నగర్లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (HPS)లో చదివిన ఈ విద్యార్థిని తాను సాధించిన ఈ స్థాయి మార్కులు, చూపిన ప్రతిభపై అక్షరటుడేతో పంచుకున్న మనోగతాలు, అనుభవాలు, సూచనలు ఇతర విద్యార్థులకు మార్గదర్శకంగా నిలుస్తాయి.
Deeksha Success Story | పక్కా ప్లాన్ ప్రకారం..
“నేను ఈ స్థాయి మార్కులు సాధించడానికి ప్రధాన కారణం సరైన ప్రణాళిక. మొదటి నుంచే ఏం చదవాలి..? ఎలా చదవాలి..? అనే దానిపై స్పష్టమైన ప్రణాళిక వేసుకున్నాను. చివరి సమయంలో ఒత్తిడికి లోనవకుండా, ప్రతిరోజు కొద్దికొద్దిగా చదవడం అలవాటు చేసుకున్నాను. దీనివల్ల పరీక్షల సమయంలో భయం లేకుండా ప్రశాంతంగా రాయగలిగాను..” అని దీక్ష తెలిపింది.
చదువులో ఒత్తిడి లేకపోవడం కూడా కీలకమని ఆమె పేర్కొంది. “మార్కుల కోసం నా తల్లిదండ్రులు ఎప్పుడూ నన్ను ఒత్తిడి చేయలేదు. నాపై నమ్మకం ఉంచారు. అదే నాకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది..” అని వివరించింది.
Deeksha Success Story | మొబైల్, సోషల్ మీడియాకు దూరం
విద్యార్థులకు దీక్ష ఇచ్చిన సూచనలు ఎంతో విలువైనవి.. “పరీక్షల ముందు ఒక్కసారిగా ఎక్కువ చదవడం కంటే, రోజూ కొద్దిగా చదవడం చాలా మంచిది. ముఖ్యంగా అర్థం చేసుకుంటూ చదవడం ఎంతో ముఖ్యం. టైమ్ టేబుల్ వేసుకుని దాన్ని క్రమం తప్పకుండా పాటిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు. అయితే మొబైల్, సోషల్ మీడియాకు దూరంగా ఉండటం చాలా అవసరం..” అని స్పష్టం చేసింది.
మానసిక ప్రశాంతత కూడా ముఖ్యమని దీక్ష చెబుతోంది. “ఒత్తిడి వచ్చినప్పుడు చిన్న విరామం తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో మాట్లాడటం, కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవడం వల్ల చదువుపై ఫోకస్ పెరుగుతుంది..” అని వివరించింది.
ఇది కూడా చదవండి: Telangana Cabinet Decisions | భూముల ధరల పెంపు.. ఈ నెలాఖరు నుంచే అమలు!

