అక్షరటుడే, వెబ్డెస్క్: DK Shivakumar Karnataka CM | కర్ణాటక కాంగ్రెస్ రాజకీయాల్లో మునుపెన్నడూ లేనంతటి భారీ కుదుపు చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి మార్పుపై గత కొన్ని రోజులుగా సాగుతున్న సస్పెన్స్కు ఎట్టకేలకు తెరపడింది.
ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేయడానికి అంగీకరించడంతో, నూతన ముఖ్యమంత్రిగా కేపీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. మే 30వ తేదీ (శనివారం) ఆయన కర్ణాటక 24వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
DK Shivakumar Karnataka CM | ఫలించిన మూడేళ్ల నిరీక్షణ
కర్ణాటకలో 2023 మే నెలలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సిద్ధరామయ్య – డీకే శివకుమార్ వర్గాల మధ్య అంతర్గత అధికార పోరు సాగుతూనే ఉంది. అప్పట్లోనే “రొటేషన్ పద్ధతి” (పదవీకాలం పంపకం) ఫార్ములా ఉందనే ప్రచారం జరిగింది.
దానికి తగ్గట్టుగానే, సుమారు మూడేళ్ల పరిపాలన తర్వాత సిద్ధరామయ్య తప్పుకోవాల్సి వచ్చింది. హైకమాండ్ పిలుపు మేరకు ఢిల్లీ వెళ్లిన సిద్ధరామయ్యతో ఏఐసీసీ పెద్దలు జరిపిన 6 గంటల సుదీర్ఘ చర్చల అనంతరం ఆయన సీఎం పదవి నుంచి తప్పుకోవడానికి అంగీకరించారు.
సిద్ధరామయ్యను త్వరలోనే రాజ్యసభకు పంపి, జాతీయ రాజకీయాల్లో పెద్ద పీట వేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది.
DK Shivakumar Karnataka CM | డిప్యూటీ సీఎంగా సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర?
సిద్ధరామయ్య రాజీనామాకు అంగీకరించిన నేపథ్యంలో, ఆయన వర్గాన్ని ప్రసన్నం చేసుకోవడానికి హైకమాండ్ ఒక కొత్త ఫార్ములాను తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది.
సిద్ధరామయ్య కుమారుడు, ప్రస్తుత ఎమ్మెల్సీ డాక్టర్ యతీంద్ర సిద్ధరామయ్యను ఉప-ముఖ్యమంత్రి (Deputy CM) పదవికి ఎంపిక చేసే అవకాశం బలంగా కనిపిస్తోంది.
తద్వారా అటు సిద్ధరామయ్య అనుచరులకు, ఇటు కురుబా సామాజిక వర్గానికి ఎలాంటి అసంతృప్తి కలగకుండా సమతుల్యత పాటించాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది.
DK Shivakumar Karnataka CM | సిద్ధరామయ్య రాజీనామా.. శనివారం ముహూర్తం
రాజకీయ బదిలీల్లో భాగంగా గురువారం (మే 28) ఉదయం సిద్ధరామయ్య తన మంత్రివర్గ సహచరులతో కావేరి నివాసంలో చివరిసారిగా ‘ఫేర్వెల్ బ్రేక్ఫాస్ట్’ సమావేశం నిర్వహించనున్నారు.
అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్కు తన రాజీనామా పత్రాన్ని సమర్పిస్తారు. అంతా అనుకున్నట్లు జరిగితే, మే 30న డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా, యతీంద్ర సిద్ధరామయ్య డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఈ మార్పు ద్వారా 2028 అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయడమే కాకుండా, అంతర్గత విబేధాలకు శాశ్వతంగా ఫుల్స్టాప్ పెట్టవచ్చని కాంగ్రెస్ అధిష్ఠానం గట్టిగా నమ్ముతోంది.


