అక్షరటుడే, వెబ్డెస్క్: Fake Currency Notes | తెలంగాణ (Telangana)లోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem District) దమ్మపేట మండలంలో బుధవారం ఉదయం దొంగనోట్ల కలకలం రేగింది. లచ్చాపురం గ్రామ శివారులోని కొర్రాజుల చెరువు సమీపంలో పెద్దఎత్తున రూ.500 నకిలీ నోట్లు చెల్లాచెదురుగా పడి ఉండడం స్థానికులను షాక్కు గురిచేసింది. నిర్మానుష్యంగా ఉండే చెరువు కట్ట ప్రాంతంలో ఒక్కసారిగా నోట్లు కనిపించడంతో గ్రామస్థులు తొలుత ఆశ్చర్యానికి గురయ్యారు.
విషయం అనుమానాస్పదంగా అనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న దమ్మపేట ఎస్సై సాయి కిషోర్ రెడ్డి తక్షణమే స్పందించారు. ఆయన ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్సై బాలస్వామి (Additional SI Balaswamy) పోలీసు సిబ్బందితో కలిసి ఉదయం 9:30 గంటల ప్రాంతంలో సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చేపట్టారు. స్థానికుల సహకారంతో అక్కడ పడి ఉన్న నోట్లన్నింటినీ ఏరి స్వాధీనం చేసుకున్నారు.
Fake Currency Notes | ఇది ఎవరి పని ?
పోలీసుల ప్రాథమిక పరిశీలనలో ఈ నోట్లు నకిలీవని తేలింది. ముద్రణలో ఉపయోగించిన కాగితం నాణ్యత, భద్రతా లక్షణాల్లో స్పష్టమైన తేడాలు ఉన్నట్లు గుర్తించారు. నకిలీ కరెన్సీ (Fake Currency) తయారు చేసే ముఠా కార్యకలాపాలకు ఇది సంబంధం ఉండవచ్చని అనుమానిస్తున్నారు. పోలీసుల రాకను గమనించడంతో లేదా పట్టుబడతామనే భయంతో గుర్తుతెలియని వ్యక్తులు ఈ నోట్లు చెరువు కట్ట వద్ద పారేసి వెళ్లి ఉంటారని భావిస్తున్నారు. ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న నోట్ల మొత్తం విలువ ఎంత అన్నదానిపై లెక్కలు వేస్తున్నారు.
ఈ ఘటనపై దమ్మపేట పోలీసులు (Dammepeta Police) కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నకిలీ నోట్ల మూలాలు ఎక్కడ? ఈ ప్రాంతానికి ఎలా చేరాయి? సరిహద్దు ప్రాంతాల నుంచి ఎవరైనా తీసుకొచ్చారా? అనే కోణాల్లో విచారణ సాగుతోంది. గ్రామ శివారులో ఒక్కసారిగా దొంగనోట్లు కనిపించడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అనుమానితుల కదలికలపై పోలీసులు నిఘా పెంచి, త్వరలోనే ఈ ముఠాను పట్టుకుంటామని వెల్లడించారు.
ఇది కూడా చదవండి..: Telangana Heatwave | భానుడి భగభగలు.. తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు..

