అక్షరటుడే, వెబ్డెస్క్:Fuel Price Hike| దేశంలో వరుసగా పెరుగుతున్న ఇంధన ధరలపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge)కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సామాన్య ప్రజల కష్టార్జితాన్ని, పొదుపు మొత్తాలను తగలబెట్టేందుకు మోదీ సర్కారు పెట్రోల్ చల్లుతోందని ఆయన ఘాటుగా విమర్శించారు. గడిచిన రెండు వారాల వ్యవధిలోనే ఇంధన ధరలను పెంచడం ఇది నాలుగోసారి అని, ఈ రోజువారీ దోపిడీకి అంతం లేకుండా పోయిందని మండిపడ్డారు.
Fuel Price Hike | 12 ఏళ్లలో రూ.43 లక్షల కోట్ల లూటీ..
గత 12 ఏళ్ల బీజేపీ పాలనలో ఇంధన ధరల పేరుతో మోదీ ప్రభుత్వం ఏకంగా రూ.43 లక్షల కోట్లను ప్రజల నుంచి వసూలు చేసిందని ఖర్గే విరుచుకుపడ్డారు. 2014లో రూ.71.41 గా ఉన్న లీటర్ పెట్రోల్ ధరను ప్రస్తుతానికి రూ.102 దాటించారని ఎద్దేవా చేశారు. ఇంధన ధరల భారాన్ని దేశంలోని రైతుల నుంచి మొదలుకొని ఎంఎస్ఎంఈ (MSME)ల వరకు ప్రతి ఒక్కరూ మోస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల కష్టాల కంటే కార్పొరేట్ లాభాలకే బీజేపీ ప్రాధాన్యత ఇస్తుందనడానికి.. ఇంధన ధరలు పెరిగిన ప్రతిసారీ ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన HPCL, BPCL, IOC షేర్లు భారీగా పెరగడమే నిదర్శనమన్నారు.
Fuel Price Hike | దేశవ్యాప్తంగా మళ్లీ పెరిగిన ధరలు..
ప్రభుత్వ రంగ చమురు సంస్థలు దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచాయి. తాజా సవరణతో లీటర్ పెట్రోల్పై రూ.2.84, డీజిల్పై రూ.2.86 చొప్పున అదనపు భారం పడింది. పెరిగిన ధరలు ఇవాళ ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చాయి. ఈ తాజా పెంపుతో భాగ్యనగరాసులపై భారం మరింత ముదిరింది. ప్రస్తుతం హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.115.58 కి చేరగా, డీజిల్ ధర రూ.103.74 కు పెరిగింది. అలాగే దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.102.12 కాగా, డీజిల్ రూ.95.20 గా నమోదైంది. రెండు వారాల్లోనే నాలుగోసారి ధరలు పెరగడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు నిత్యావసరాల ధరలు ఎక్కడ పెరుగుతాయోనని తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ఇది కూడా చదవండి: Paragliding Plane Collision| మృత్యుంజయురాలు.. గాల్లో విమానం పారాగ్లైడర్ను ఢీకొట్టినా..!


