అక్షరటుడే, వెబ్డెస్క్: Heatwave Alert | దేశవ్యాప్తంగా ఎండలు (Heatwave) దంచికొడుతున్నాయి. పలు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ తీవ్రమైన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు పలు కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు, రైతులు, కార్మికులు ఈ మండుటెండల వల్ల ఎక్కువగా ప్రభావితమవుతున్నారని, అందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రధాని కోరారు.
Heatwave Alert | ప్రధాని మోదీ చేసిన సూచనలు..
ఎండలు ఎక్కువగా ఉండే మధ్యాహ్నం వేళల్లో వీలైనంత వరకు బయటకు వెళ్లకపోవడం మంచిది. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండటానికి నిరంతరం నీరు తాగుతూ ఉండాలి. ఇంట్లో ఉండే వృద్ధుల ఆరోగ్యాన్ని నిరంతరం గమనిస్తూ ఉండాలి. మీ ఇళ్లు, దుకాణాల వెలుపల పక్షులు, జంతువుల కోసం నీటి పాత్రలను ఉంచాలని ప్రధాని పిలుపునిచ్చారు.

Heatwave Alert | ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు..
తల తిరగడం, వికారం, తీవ్రమైన అలసట వంటి వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయవద్దని ప్రధాని హెచ్చరించారు. ఎవరైనా అకస్మాత్తుగా నీరసించి స్పృహ కోల్పోతే వెంటనే వారిని నీడ ఉన్న ప్రదేశానికి తరలించి సాయం చేయాలన్నారు. సమయానికి స్పందిస్తే ఒకరి ప్రాణాన్ని కాపాడవచ్చని పేర్కొన్నారు.

Heatwave Alert | వాతావరణ శాఖ హెచ్చరిక..
రాబోయే రోజుల్లో మధ్య, వాయువ్య భారతంలోని అనేక ప్రాంతాల్లో తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ముఖ్యంగా దిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండనుంది. ప్రస్తుతం తెలంగాణ, కోస్తా ఆంధ్రప్రదేశ్తో పాటు విదర్భ, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, హరియాణా, రాజస్థాన్, బిహార్, ఒడిశా వంటి పలు రాష్ట్రాల్లో భానుడు భగభగలాడుతున్నాడు. ఉత్తర్ప్రదేశ్, మధ్యప్రదేశ్లలో కూడా భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే, మే 29 నుండి దిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ఊరటనిచ్చే వార్త చెప్పింది.
ఇది కూడా చదవండి: Jawaharlal Nehru Services | దేశానికి జవహర్ లాల్ నెహ్రూ చేసిన సేవలు మరువలేనివి..


