అక్షరటుడే, వెబ్డెస్క్ : Heavy Rains in UP | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లో ప్రకృతి ప్రకోపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో కురిసిన భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు, ధూళి తుఫానులు, పిడుగుల కారణంగా కనీసం 78 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. పలుచోట్ల భారీ వడగండ్ల వానలు కురవడంతో సాధారణ జీవనం అస్తవ్యస్తమైంది.
అత్యధిక మరణాలు భదోహి జిల్లా (Bhadohi District)లో నమోదయ్యాయి. అక్కడ ఒక్క జిల్లాలోనే 15 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. అలాగే ఫతేపూర్, భూదాన్ సహా పలు జిల్లాల్లో పిడుగులు, చెట్లు కూలిపోవడం, గోడలు పడిపోవడం వంటి ఘటనలతో భారీ నష్టం సంభవించింది. పలువురు తీవ్రంగా గాయపడగా, వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
Heavy Rains in UP | సీఎం తీవ్ర దిగ్భ్రాంతి..
భారీ వర్షాలు, వడగండ్ల వానలతో వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతింది. వేల ఎకరాల్లో పంటలు నేలమట్టమయ్యాయని అధికారులు ప్రాథమిక అంచనాలు వెల్లడించారు. ముఖ్యంగా గోధుమ, వరి, కూరగాయల పంటలకు భారీ నష్టం వాటిల్లినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనేక ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కొన్ని జాతీయ రహదారులపై కూడా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విపత్తు నిర్వహణ బృందాలు, విద్యుత్ శాఖ సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.
Heavy Rains in UP | గాయపడిన వారికి మెరుగైన వైద్యం
ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (CM Yogi Adityanath) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తక్షణ సహాయం అందించాలని, పంటలు, ఇళ్లు కోల్పోయిన బాధితులకు 24 గంటల్లోగా పరిహారం చెల్లించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు. అలాగే విపత్తు నిర్వహణ బృందాలు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలను వేగవంతం చేయాలని సీఎం స్పష్టం చేశారు. ప్రజలు కూడా వాతావరణ హెచ్చరికలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి..: UP Storm Deaths | యూపీలో తుపాను బీభత్సం.. 74 మంది మృతి!

