HYDRAA Commissioner | హైడ్రా కమిషనర్‌పై హైకోర్టు వేటు : కఠిన చర్యల వెనుక ప్రజా ప్రయోజనమా? చట్ట ఉల్లంఘనా?

తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ కమిషనర్, సీనియర్ ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాథ్‌కు తెలంగాణ ఉన్నత న్యాయస్థానంలో తీవ్రమైన ఎదురుదెబ్బ తగిలింది.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: HYDRAA Commissioner | తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRAA) కమిషనర్, సీనియర్ ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాథ్‌ (A.V. Ranganath)కు తెలంగాణ ఉన్నత న్యాయస్థానంలో తీవ్రమైన ఎదురుదెబ్బ తగిలింది.

న్యాయస్థానం ఇచ్చిన స్పష్టమైన ఉత్తర్వులను పదేపదే ఉల్లంఘిస్తున్నారనే తీవ్ర ఆరోపణల నేపథ్యంలో, ఆయన్ను తక్షణమే హైడ్రా కమిషనర్ బాధ్యతల నుంచి తప్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని (CS) హైకోర్టు ఆదేశించింది.

ఒక బాధ్యతాయుతమైన ఉన్నతాధికారిపై ఏకంగా 63 కోర్టు ధిక్కరణ (Contempt of Court) పిటిషన్లు నమోదు కావడం, వాటిపై ఉన్నత న్యాయస్థానం ఈ స్థాయిలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం రాష్ట్ర ఐఏఎస్, ఐపీఎస్ వర్గాల్లో పెద్ద ఎత్తున కలకలం రేపింది.

Hydraa Demolitions

HYDRAA Commissioner | లోతుకుంట వివాదం.. కోర్టు ధిక్కరణ కేసుల పరంపర

మల్కాజిగిరి పరిధిలోని లోతుకుంట ప్రాంతంలో ఉన్న సర్వే నంబర్ 1, 2 లకు సంబంధించిన 40 ఎకరాల భూముల్లో గతంలోనే హైకోర్టు ముందస్తు స్టే ఉత్తర్వులు జారీ చేసింది.

అయితే, న్యాయస్థానం ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలు అమల్లో ఉన్నప్పటికీ, శాంతా శ్రీరాం కన్‌స్ట్రక్షన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్ నిర్మించిన ఫెన్సింగ్‌ను హైడ్రా సిబ్బంది తొలగించారు.

ఈ చర్యను సవాలు చేస్తూ సంబంధిత నిర్మాణ సంస్థ హైకోర్టులో ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై లోతుగా విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం, హైడ్రా వ్యవహరించిన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

న్యాయస్థానం వ్యాఖ్యలు: రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరుడికి కోర్టులను ఆశ్రయించే హక్కు ఉందని, ఒక ఉన్నత పదవిలో ఉన్న అధికారి న్యాయస్థానాల ఆదేశాలను ఇన్నిసార్లు బేకాతరు చేయడం ఏమాత్రం సహించరానిదని స్పష్టం చేసింది.

AV Ranganath HYDRAA

HYDRAA Commissioner | ఏజీ జోక్యం – క్షమాపణ

విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ (AG) జోక్యం చేసుకుంటూ, పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేస్తామని తెలిపారు. అనంతరం దాఖలు చేసిన అఫిడవిట్‌లో కమిషనర్ ఏవీ రంగనాథ్ కోర్టుకు బేషరతుగా క్షమాపణలు చెప్పారు. న్యాయవ్యవస్థపై తనకు సంపూర్ణ విశ్వాసం ఉందని, వివాదాస్పద భూమిలోకి తమ సిబ్బంది వెళ్లలేదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

కఠిన ఆదేశాలు: ఒకే అధికారిపై 63 ధిక్కరణ పిటిషన్లు ఉండటంపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన ధర్మాసనం, అధికారుల వైఖరిలో మార్పు రావడం లేదని మండిపడింది. వెంటనే రంగనాథ్‌ను ఆ పదవి నుంచి తొలగించి, మరొక అధికారిని నియమించాలని ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.

hydraa

HYDRAA Commissioner | రంగనాథ్ సమర్థన: “రూ.1.50 లక్షల కోట్ల ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణే నా లక్ష్యం”

హైకోర్టు ఆదేశాలు, కేసులపై ఏవీ రంగనాథ్ తన స్పందనను తెలియజేశారు. తన రెండేళ్ల పదవీకాలంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, 48ఏ సూత్రాలకు అనుగుణంగానే ప్రభుత్వ ఆస్తులను, పర్యావరణాన్ని కాపాడేందుకు కృషి చేశానని ఆయన పేర్కొన్నారు.

భారీ ఆక్రమణల తొలగింపు: గడిచిన రెండేళ్లలో దాదాపు రూ.1.50 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కులను ఆక్రమణదారుల నుంచి విడిపించామని తెలిపారు.

చెరువుల పునరుద్ధరణ: ఆరు చెరువులను పూర్తిస్థాయిలో పునరుద్ధరించామని, మరో 20 చెరువుల్లో ఆక్రమణలను తొలగించి పునరుద్ధరణ పనులు వేగవంతం చేశామని వివరించారు.

మాఫియా కుట్రలు: కఠిన చర్యలు తీసుకుంటుండటంతో ల్యాండ్ మాఫియా, బడా ఆక్రమణదారులు తప్పుడు సమాచారంతో కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. తనపై ఉన్న 63 కేసులు కూడా భూ ఆక్రమణలపై చర్యలు తీసుకున్నందుకే నమోదయ్యాయని, వీటన్నింటినీ న్యాయపరంగానే ఎదుర్కొంటానని స్పష్టం చేశారు.

HYDRAA

HYDRAA Commissioner | పేదలపై ప్రతాపం.. పెద్దలకు వెసులుబాటు?

కాగా, హైడ్రా చేపట్టిన చర్యలపై ప్రజల నుంచి, బాధితుల నుంచి పలు తీవ్రమైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విధుల నిర్వహణలో ముక్కుసూటిగా వ్యవహరిస్తారని చెప్పే ఏవీ రంగనాథ్ తీరుపై ద్వంద్వ వైఖరి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

పెద్ద వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకుల అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడంలో జాప్యం చేస్తూ, నిరుపేద, మధ్యతరగతి ప్రజలకు చెందిన ఇళ్లను, నిర్మాణాలను రాత్రికి రాత్రే కూల్చివేసి వారిని రోడ్డున పడేశారనే వేదన బాధితుల్లో వ్యక్తమవుతోంది.

ప్రజా ప్రయోజనాల పేరు చెప్పినప్పటికీ, కోర్టు స్టే ఉత్తర్వులను, సహజ న్యాయ సూత్రాలను (Principles of Natural Justice) పక్కనపెట్టి ఏకపక్షంగా వ్యవహరించడం వల్లే రికార్డు స్థాయిలో 63 ధిక్కరణ కేసులు దాఖలయ్యాయని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు.

హైకోర్టులో దాఖలైన మెజారిటీ కోర్టు ధిక్కరణ (Contempt) కేసుల్లో బాధితులు లేవనెత్తిన ముఖ్యమైన అంశం “ముందస్తు నోటీసులు ఇవ్వకపోవడం”.

రాజ్యాంగం, మున్సిపల్ చట్టాల ప్రకారం ఏదేని నిర్మాణాన్ని అక్రమమని నిర్ధారించే ముందు యజమానులకు వివరణ ఇచ్చుకునేందుకు సమయం ఇవ్వాలి.

కానీ హైడ్రా సిబ్బంది సెలవు రోజుల్లో, తెల్లవారుజామున బుల్డోజర్లతో వచ్చి ఎటువంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా కూల్చివేతలు చేపట్టారని, దీనివల్ల న్యాయస్థానాన్ని ఆశ్రయించే సమయం కూడా తమకు దక్కలేదని అనేకమంది పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ఎఫ్‌టీఎల్ (FTL), బఫర్ జోన్ల లెక్కింపుపై సాంకేతిక సవాళ్లు, చెరువుల పరిరక్షణ పేరుతో చేపట్టిన కూల్చివేతల్లో గందరగోళం నెలకొందని ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చాయి.

రెవెన్యూ – నీటిపారుదల శాఖల సమన్వయ లోపం: ఒకే భూమికి సంబంధించి రెవెన్యూ రికార్డుల్లో ఒకలా, ఇరిగేషన్ శాఖ వద్ద మరోలా FTL (Full Tank Level) సరిహద్దులు ఉండటంతో స్పష్టత కొరవడింది.

సరైన సర్వే చేయకుండా, హద్దులు నిర్ధారించకుండా ప్రైవేటు వ్యక్తుల పట్టా భూముల్లోకి వచ్చి కూల్చివేతలు చేపట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి.

HYDRAA Commissioner | రాజకీయ & బడా సంస్థల పట్ల మృదువైఖరి

దుండిగల్ పరిధిలోని MLRIT (ఎంఎల్ఆర్ఐటి) కాలేజీ, మలక్‌పేట్/చాంద్రాయణగుట్ట పరిధిలోని ఒవైసీ మెడికల్ కాలేజీ/ఆసుపత్రి వంటి పెద్ద నిర్మాణాలపై ఫిర్యాదులు వచ్చినప్పటికీ, కేవలం నోటీసులతో సరిపెట్టి కూల్చివేతలకు వెళ్లకపోవడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.

మరోవైపు, మూసీ పరివాహక ప్రాంతాలు, లోతుకుంట, నల్లచెరువు, దుర్గం చెరువు పరిసరాల్లో దశాబ్దాలుగా నివసిస్తున్న సామాన్య, నిరుపేద కుటుంబాల ఇళ్లను కూల్చివేయడంతో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి.

hydraa 3

HYDRAA Commissioner | ప్రభుత్వానికి, ఐపీఎస్ వర్గానికి పాఠం

హైకోర్టు ఇచ్చిన ఈ తక్షణ తొలగింపు ఉత్తర్వులు పాలనా వ్యవస్థలో ఒక కీలక పరిణామంగా మారాయి.

రూల్ ఆఫ్ లా (Rule of Law): ప్రజా ప్రయోజనం, పర్యావరణ పరిరక్షణ పేరుతో చట్టాలను, కోర్టు ఆదేశాలను పక్కనబెట్టి పనిచేయడానికి వీల్లేదని, “చట్టానికి ఎవరూ అతీతులు కారు” అనే స్పష్టమైన సందేశాన్ని న్యాయస్థానం ఇచ్చింది.

సమాజంలో ప్రభుత్వ భూములు, చెరువుల పరిరక్షణ ఎంత అవసరమో, రాజ్యాంగబద్ధమైన ప్రక్రియను, ఉన్నత న్యాయస్థానాల ఉత్తర్వులను గౌరవించడం కూడా అంతే ముఖ్యం.

హైడ్రా తీసుకున్న చర్యలు కొన్నిచోట్ల ఆక్రమణదారులకు భయం కలిగించినప్పటికీ, న్యాయస్థానాల ఆదేశాల ఉల్లంఘన, నిబంధనల అమలులో చూపిన వ్యత్యాసాలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. హైకోర్టు తాజా తీర్పుతో తెలంగాణలో హైడ్రా భవిష్యత్తు కార్యాచరణ, ఆక్రమణల తొలగింపు ప్రక్రియ ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.

ఇది కూడా చదవండి..: AV Ranganath HYDRAA | రాజ్యాంగ స్ఫూర్తితో హైడ్రా పని చేస్తోంది: కమిషనర్ ఏవీ రంగనాథ్

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
3 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *