అక్షరటుడే, వెబ్డెస్క్: Idupu Kayitham controversy | ‘ఇడుపు కాయితం’ అనే సినిమా టైటిల్పై చెలరేగిన వివాదం కాస్తా ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. ఈ టైటిల్పై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ను ప్రస్తావిస్తూ, తెలంగాణ రక్షణ సేన (TRS) వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు భారాస పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఉప్పల్లో జరిగిన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, తెలంగాణ భాష, సంస్కృతిని అవమానిస్తున్నా రేవంత్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
Idupu Kayitham controversy | పవన్ను అడిగితే అర్థమవుతుంది!
హీరో ప్రియదర్శి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘ఇడుపు కాయితం’ అనే సినిమా టైటిల్ అర్థం కాలేదంటూ సోషల్ మీడియాలో కొంతమంది అవహేళన చేస్తూ ట్రోల్ చేస్తున్నారని కవిత తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘ఇడుపు కాయితం’ అంటే ఏమిటో అర్థం కావాలంటే ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను అడగాలని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ పదానికి ఉన్న అర్థం పవన్ కు బాగా తెలుసని, ఆయనైతే సరిగ్గా చెబుతారంటూ హాట్ సెటైర్లు వేశారు.
తెలంగాణ భాషపై, యాసపై గతంలో ఇలా అవహేళనలు చేస్తేనే నాడు కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని కవిత గుర్తుచేశారు. ఇకనైనా ఇలాంటి వెకిలి ప్రయత్నాలు మానుకొని, ఒకరి భాషను, సంస్కృతిని మరొకరు గౌరవించుకోవాలని ఆమె హితవు పలికారు.
Idupu Kayitham controversy | రేవంత్కు తెలంగాణ ఉద్యమ నేపథ్యం లేదు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఘాటు విమర్శలు గుప్పించారు. ఆయనకు అసలు తెలంగాణ ఉద్యమంతో ఎలాంటి సంబంధం లేదని కవిత తీవ్రంగా విమర్శించారు.
ఉద్యమ సెగ తెలియని మనిషి సీఎం సీట్లో కూర్చోవడం వల్లే, తెలంగాణ భాషకు జరుగుతున్న అవమానాలను చూస్తూ.. కాంగ్రెస్ సర్కారు మౌనంగా ఉంటోందని ధ్వజమెత్తారు.
Idupu Kayitham controversy | బీఆర్ఎస్లో ‘గుంటనక్క’ అంటూ మండిపాటు..
తెలంగాణ అస్తిత్వంపై ఇంత దాడి జరుగుతున్నా.. కాంగ్రెస్, భాజపాతో పాటు భారాస సైలెంట్గా ఉండటం సిగ్గుచేటని కవిత మండిపడ్డారు. భారాస పార్టీకి తెలంగాణతో పేగు బంధం తెగిపోయిందని ఆమె విమర్శించారు.
భారాసలోని ఒక గుంటనక్క ఆంధ్రా కార్పొరేట్ శక్తులతో, చైతన్య, నారాయణ విద్యాసంస్థలతో కలిసి పాల వ్యాపారం చేస్తోందని, అందుకే ఆ పార్టీ నాయకులు నోరు మెదపడం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Idupu Kayitham controversy | అస్తిత్వం కోసం పోరాటం..
కార్పొరేట్ స్కూళ్లు, హాస్పిటళ్లలో ముల్కానూరు, మదర్ డెయిరీ, విజయ డెయిరీల నుంచే పాలు కొనుగోలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం జీవో తేవాలని కవిత డిమాండ్ చేశారు. మన యాస, అస్తిత్వం, తెలంగాణ ప్రజలు, ఉద్యమకారుల కోసం తానే నిలబడి పోరాడుతానని.. లాఠీలు, రబ్బరు తూటాలు కూడా నన్ను దాటుకొని రావాలని స్పష్టం చేశారు.
Idupu Kayitham controversy | జులై 2న భారీ ‘భూ పోరాటం’
ఉద్యమకారులకు కాంగ్రెస్ సర్కారు ఇస్తామన్న 250 గజాల స్థలం కోసం జులై 2న హైదరాబాద్లోని ఉప్పల్ భగాయత్లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ భూపోరాటం ఉంటుందని కవిత ప్రకటించారు. కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన అన్ని హామీల అమలతోపాటు ఉచిత విద్య, వైద్యం కోసం ప్రజల పక్షాన నిలబడి పోరాడుతామని ఈ సందర్భంగా ప్రకటించారు.