అక్షరటుడే వెబ్డెస్క్: Vizag Steel Plant Accident | విశాఖ ఉక్కు కర్మాగారంలో వరుస ప్రమాదాలు చోటుచేసుకోవడం పట్ల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ( Jagan Mohan Reddy ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే స్టీల్ ప్లాంట్లో పరిస్థితులు అధ్వాన్నంగా మారాయని ఆయన విమర్శించారు.
Vizag Steel Plant Accident | ప్రమాదానికి కారణం..
తాజాగా జరిగిన ప్రమాదంపై స్పందించిన జగన్, ఇది కేవలం ఉద్యోగుల తప్పిదం కాదని స్పష్టం చేశారు. ముడి సరుకుల మిక్సింగ్లో జరిగిన పొరపాట్ల వల్లే ఉక్కు ద్రవం బ్లాస్ట్ అయ్యిందని, సరైన ప్రమాణాలు పాటించకపోవడమే ఈ దుర్ఘటనలకు కారణమని ఆయన ఆరోపించారు. ఈ ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండటంపై ఆయన విచారం వ్యక్తం చేశారు.
Vizag Steel Plant Accident | లోకేశ్ వ్యాఖ్యలపై మండిపాటు..
మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లింపు విషయంలో మంత్రి నారా లోకేశ్ తీరును జగన్ తప్పుబట్టారు. “కార్మికులకు కంపెనీ నుంచి రావాల్సిన పరిహారాన్నే ప్రభుత్వం ఇస్తున్నట్లు గొప్పలు చెప్పుకోవడం సరికాదు. ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా అదనంగా ఇవ్వడం లేదు” అని జగన్ మండిపడ్డారు. మంత్రి లోకేశ్ మానవత్వం లేకుండా మాట్లాడుతున్నారని, కోటి 72 లక్షల పరిహారం అనేది కార్మికుల హక్కని ఆయన గుర్తుచేశారు.
Vizag Steel Plant Accident | పెంటయ్య కుటుంబానికి అన్యాయం..
గతంలో జరిగిన ప్రమాదంలో మరణించిన పెంటయ్య కుటుంబానికి ఇప్పటికీ న్యాయం జరగలేదని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. “14 నెలలు గడిచినా బాధితులకు పరిహారం అందలేదు. పైగా ఫైల్ కనిపించడం లేదని సమాధానం చెప్పడం ఎంతవరకు సమంజసం?” అని ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు. ప్రభుత్వ బాధ్యతారాహిత్యం వల్లే బాధితులు నష్టపోతున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: RTA Transparency Measures | ఏజెంట్ల వ్యవస్థకు చెక్..!
