అక్షరటుడే, భీమ్గల్ : Government Schools | రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా విద్యాశాఖ కీలక అడుగులు వేస్తోంది. ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేస్తూ, పేద, మధ్యతరగతి పిల్లలకు నాణ్యమైన చదువును ఉచితంగా అందించడమే లక్ష్యంగా సరికొత్త విధానాలను అమల్లోకి తెస్తోంది.
ఇందులో భాగంగా ఒకవైపు జిల్లాలోని ఎంపిక చేసిన ఉన్నత పాఠశాలల్లో ప్రాథమిక విభాగాలను ఏర్పాటు చేస్తూ ఒకే ప్రాంగణంలో పూర్తిస్థాయి విద్యకు శ్రీకారం చుట్టగా, మరోవైపు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలోని 336 బడుల్లో పూర్వ ప్రాథమిక (ప్రీ-ప్రైమరీ) తరగతులను ప్రారంభించేందుకు విద్యాశాఖ అనుమతులు మంజూరు చేసింది.
నిజామాబాద్ జిల్లా (Nizamabad District)లో ప్రస్తుతం 769 ప్రాథమిక పాఠశాలలు, 132 ప్రాథమికోన్నత పాఠశాలలు, 255 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. అయితే విద్యార్థుల సంఖ్య తగ్గడం, పాఠశాలల మధ్య దూరం, ఉపాధ్యాయుల వినియోగంలో సమన్వయం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పాఠశాలల పునర్వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టింది.దీనిలో భాగంగా జిల్లాలోని 112 ఉన్నత పాఠశాలల్లో ప్రాథమిక విభాగాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నుంచి అనుమతులు లభించాయి. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు వేర్వేరు ప్రాంగణాల్లో ఉండటంతో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు దీనితో చెక్ పడనుంది. విద్యార్థులు ఒకే క్యాంపస్లో అడుగుపెడితే పదో తరగతి వరకు నిశ్చింతగా చదువుకునే అవకాశం కలుగుతుంది.
Government Schools | నాణ్యమైన విద్య
ప్రైవేటు స్కూళ్లకు దీటుగా ఆటపాటలతో కూడిన నాణ్యమైన బోధనను అందించేందుకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలో మొత్తం 336 ప్రభుత్వ పాఠశాలలు ఎంపికయ్యాయి. ఈ విద్యాసంవత్సరం నుంచే ఈ విధానాన్ని అమల్లోకి తేవడానికి అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. నిజామాబాద్ జిల్లాలో 191 పాఠశాలలు, కామారెడ్డిలో 145 పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతుల నిర్వహణకు అనుమతులు మంజూరు అయ్యాయి.

Government Schools | ప్రయోజనాలు
ప్రస్తుతం ప్రైవేట్ స్కూళ్లలో (private schools) నర్సరీ నుంచి పదో తరగతి వరకు ఒకే క్యాంపస్ ఉంటుంది. ప్రభుత్వ బడుల్లో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు వేర్వేరుగా ఉంటాయి. దీంతో ఆరో తరగతిలో మళ్లీ విద్యార్థులు కొత్తగా ప్రవేశం పొందాల్సి ఉంటుంది. ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఒకటో తరగతి పదో తరగతి వరకు ఒకే బడిలో తరగతులు నిర్వహించేలా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. అలాగే ప్రీ ప్రైమరీతో ఎల్కేజీ, యూకేజీ సీట్ల కోసం ప్రైవేటు స్కూళ్లలో వేల రూపాయల డొనేషన్లు కట్టలేని పేద తల్లిదండ్రులకు ప్రభుత్వ నిర్ణయం పెద్ద ఊరటనివ్వనుంది. కొత్త విధానంతో మధ్యలో బడి మానేసే విద్యార్థుల సంఖ్య తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
Government Schools | చర్యలు ప్రారంభం
నూతన మార్పుల నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు ఇప్పటికే ఆయా పాఠశాలల పరిధిలోని విద్యార్థుల వివరాల సేకరణ, మౌలిక వసతుల అంచనా, గదుల లభ్యత వంటి అంశాలపై చర్యలు ప్రారంభించారు. ప్రీ-ప్రైమరీ తరగతుల కోసం గదులను రంగురంగుల చిత్రాలతో ముస్తాబు చేయడంతో పాటు, ప్రత్యేకమైన ‘బాల మిత్ర’ కిట్లను, ఆట వస్తువులను సరఫరా చేయనున్నారు. ఉపాధ్యాయులకు చిన్నారులను ఆకట్టుకునేలా బోధన సాగించడానికి ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఉపాధ్యాయుల వినియోగం సమర్థవంతంగా ఉండటంతో పాటు పాఠశాలల నిర్వహణ కూడా సులభతరం కానుందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రీ ప్రైమరీ ప్రారంభంతో ప్రభుత్వ బడుల్లో ప్రవేశాలు పెరుగుతాయని అధికారులు పేర్కొంటున్నారు.
Government Schools | నాణ్యమైన విద్య
– బాలకృష్ణ, జిల్లా సెక్టోరియల్ అధికారి
బడుల బలోపేతానికి ప్రభుత్వ నిర్ణయాలు ఎంతో దోహదపడతాయి. 336 స్కూళ్లలో ప్రీ-ప్రైమరీ, 112 హైస్కూళ్లలో ప్రాథమిక విభాగాల ఏర్పాటుకు అనుమతులు వచ్చాయి. దీంతో ఒకే ప్రాంగణంలో 1 నుంచి 10 తరగతుల వరకు నాణ్యమైన ఉచిత విద్య అందుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో డ్రాపౌట్లు తగ్గి, అడ్మిషన్లు పెరుగుతాయి. కొత్త విద్యా సంవత్సరం లోపే మౌలిక వసతులు, గదుల లభ్యత, ఉపాధ్యాయుల శిక్షణ వంటి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తాం.
ఇది కూడా చదవండి..: RTA Transparency Measures | ఏజెంట్ల వ్యవస్థకు చెక్..!
