అక్షరటుడే, వెబ్డెస్క్ : Farmers Problems | రాష్ట్రంలో అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. యాసంగి సీజన్ పూర్తయి.. వానాకాలం సీజన్ సమీపిస్తున్న ఇంకా ధాన్యం, ఇతర పంటల కొనుగోళ్లు పూర్తి కాలేదు. ఆరుగాలం పడించిన పంటను అమ్ముకోవడానికి నెలకు పైగా పడిగాపులు కాయాల్సి వస్తోంది. దీనికి పెరిగిన ధరలు, ప్రభుత్వం, అధికారుల సహాకారం లేకపోవడంతో రైతలు తిప్పలు పడుతున్నారు.
Farmers Problems | రైతు భరోసా ఎక్కడ..
రాష్ట్రంలో గతంలో పంట సీజన్ ప్రారంభానికి ముందు గత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం రైతు బంధు జమ చేసేది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఒక్క సీజన్లో మాత్రమే సమయానికి రైతు భరోసా (Rythu Bharosa) వేసింది. యాసంగి కోతలు అయిపోయింది. మరో వారం పది రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి రానున్నాయి. ఇప్పటి వరకు రైతులకు పూర్తిస్థాయిలో రైతు భరోసా జమ కాలేదు. ఏప్రిల్ నెలాఖరు వరకు రైతు భరోసా జమ చేస్తామని సీఎం ప్రకటించారు. కానీ రెండు విడతల్లో రెండు ఎకరాల వరకు మాత్రమే నిధులు విడుదల చేశారు.
Farmers Problems | నత్తనడకన కొనుగోళ్లు
గత వానాకాలం సీజన్లో అధిక వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. దిగుబడి గణనీయంగా తగ్గింది. ఈ క్రమంలో యాసంగిలో దేవుడు కరుణించాడు. పంటలు బాగా పండాయి. అయితే అన్నదాతలకు ఆ ఆనందం లేకుండా పోయింది. పండించిన పంటను అమ్ముకోలేని దుస్థితి ఉంది. పంట కోసి నెలలు గడుస్తున్నా.. కొనుగోళ్లు సాగడం లేదు. లారీల కొరత ఉందని తూకాలు ఆలస్యం చేస్తున్నారు. దీంతో రాశుల్లో ధాన్యం బరువు తగ్గుతోంది. మరోవైపు మిల్లర్లు భారీగా తరుగు తీస్తున్నారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైతుల నుంచి హమాలీ ఛార్జీలతో పాటు లారీల కోసం బస్తాకు అదనంగా రూ.5 నుంచి రూ.10 వరకు వసూలు చేస్తున్నారు. అయినా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకున్న పాపన పోలేదు.
Farmers Problems | ఎరువుల కోసం పోరాటం
జూన్లో తొలకరి వర్షం పలకరించే అవకాశం ఉంది. దీంతో అన్నదాతలు ఇప్పటి నుంచే సాగుకు సమాయత్తం అవుతున్నారు. కావాల్సిన ఎరువులు కొనుగోలు చేస్తున్నారు. యూరియా (Urea) ఎలాగు యాప్ ద్వారానే విక్రయిస్తున్నారు. కాంప్లెక్స్ ఎరువులను (Fertilizers) మాత్రం దుకాణాల ద్వారా అమ్ముతున్నారు. అయితే అవి కూడా సరిపడా సరఫరా చేయడం లేదు. దీనికి తోడు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. నవరత్న కాంప్లెక్స్ ఎరువు ధర బస్తాపై రూ.1430 ఉండగా.. ధరలు పెరిగాయని రూ.1600కు అమ్ముతున్నారు. డీఏపీ, ఎన్పీకే వంటి ఎరువుల ధరలను సైతం భారీగా పెంచారు. అంతపెట్టి కొందామన్నా ఎరువులు దొరకడం లేదని రైతులు వాపోతున్నారు.
Farmers Problems | యూరియా కోసం యుద్ధం తప్పదు
రాష్ట్రంలో వానాకాలంలో ఎక్కువగా వరి సాగు చేస్తారు. దీనికి అధికమొత్తంలో యూరియా అవసరం ఉంటుంది. అయితే యాసంగిలో యాప్ ద్వారా యూరియా విక్రయాలతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం అలాగే అమ్మితే యూరియా కోసం యుద్ధం తప్పదని అన్నదాతలు భావిస్తున్నారు. పంట సాగు చేయడం కంటే.. ఎరువులు కొనడం, పంట అమ్మడం గగనం అవుతోందని వాపోతున్నారు. మరోవైపు కొంతమంది రైతులు మోతాదుకు మించి యూరియా వినియోగిస్తున్నారు. అంతేగాకుండా అవసరానికి మించి ఎరువులు, యూరియా కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటారు. ఇలాంటి వారికి అవగాహన కల్పించాల్సిన వ్యవసాయ అధికారులు పత్తాకు లేకుండా పోతున్నారు. రైతు వేదికల్లో నిత్యం అందుబాటులో ఉండాల్సిన వారు మొక్కుబడిగా వస్తున్నారు. అయినా ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.

Farmers Problems | ఇంధన ధరల పెరుగుదలతో..
కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెట్రోల్, డీజిల్ రేట్లను (Fuel Price) పెంచింది. 8 రోజుల వ్యవధిలో మూడు సార్లు ధరలు పెరిగాయి. భవిష్యత్లో మరింత పెరిగే అవకాశం ఉంది. దీని ప్రభావం వ్యవసాయ రంగంపై తీవ్రంగా పడనుంది. ప్రస్తుతం అన్ని పనలు యంత్రాలతో చేస్తున్నారు. దీంతో డీజిల్ వాడకం అధికంగా ఉంది. వాటి రేట్లు పెరగడంతో ట్రాక్టర్ కిరాయిలు పెరిగి పెట్టుబడి పెరుగుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వరుణుడు కరుణించేనా..
ఈ ఏడాది వర్షాలు అంతంత మాత్రంగానే కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఎల్నినో ప్రభావంతో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందన్నారు. దీంతో ఏ పంటలు వేయాలని రైతులు ఆలోచిస్తున్నారు. ఇన్ని కష్టాల మధ్య పంట వేస్తే.. తీరా వర్షాలు పడక ఎండిపోతే పరిస్థితి ఏమిటని ఆందోళన చెందుతున్నారు.
దీనిని కూడా చదవండి : Telangana Beer Sales | తెలంగాణలో బీర్ల విక్రయాల జోరు.. ఎండలతో మందుబాబుల ‘చిల్’ మూడ్..


