అక్షరటుడే, వెబ్డెస్క్ : Indiramma House Scams | సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ పథకాల పేరిట ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ (Hyderabad) నగర పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల పేరిట మోసాలకు పాల్పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నగర సీపీ సజ్జనార్ (CP Sajjanar) సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. మీ సేవ, వాట్సాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో రూ.10 వేలు ముందస్తు డిపాజిట్ (ఈఎండీ) చెల్లించాల్సి ఉంటుంది. సైబర్ నేరగాళ్లు నకిలీ కాల్స్, అపరిచిత లింకులతో బురిడీ కొట్టించే ప్రమాదముందని సీపీ హెచ్చరించారు. ఈ పథకంలో ఎలాంటి దళారులు, మధ్యవర్తులకు తావులేదని, ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందని తెలిపారు. నిబంధనల ప్రకారం చెల్లించిన ఈఎండీ సొమ్ము భద్రంగా ఉంటుందని, ఒకవేళ ఇల్లు కేటాయించకపోతే ఆ మొత్తాన్ని దరఖాస్తుదారుడి ఒరిజినల్ బ్యాంకు ఖాతాకే ప్రభుత్వం నేరుగా తిరిగి జమ చేస్తుందని వివరించారు.
Indiramma House Scams | వారి మాటలు నమ్మొద్దు
డబ్బులు చెల్లిస్తే ఇల్లు కచ్చితంగా ఇప్పిస్తాం అని చెప్పే వారి మాటలు నమ్మవద్దని సూచించారు. ఈ రోజే ఆఖరు తేదీ.. వెంటనే డబ్బులు కట్టకపోతే ఇల్లు రద్దవుతుంది అని భయపెట్టి, తొందరపాటులో నగదు బదిలీ చేయించుకోవడం నేరగాళ్ల ప్రధాన ఎత్తుగడ అని హెచ్చరించారు. వాట్సాప్ ద్వారా వచ్చే అపరిచిత లింకులను నమ్మి ఏపీకే ఫైళ్లను ఇన్స్టాల్ చేస్తే ఫోన్ హ్యాక్ అయి బ్యాంక్ ఖాతాలు ఖాళీ అవుతాయని హెచ్చరించారు. ఈ పథకానికి సంబంధించి ఎలాంటి సందేహాలున్నా నివృత్తి చేసుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ‘040-24603572’ అనే హెల్ప్లైన్ నంబర్ను అందుబాటులోకి తెచ్చిందని వివరించారు.
దీనిని కూడా చదవండి : Medak Leopard Death | గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుత మృతి