అక్షరటుడే, వెబ్డెస్క్ : Indiramma Houses | ఇందిరమ్మ ఇళ్ల మంజూరు నిరంతర ప్రక్రియ అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti) అన్నారు. పేద కుటుంబానికి ఇల్లు ఆత్మ గౌరవ ప్రతీక అని పేర్కొన్నారు. అర్హులైన పేదలందరికీ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో ఉమ్మడి ఖమ్మం (Khammam), వరంగల్ (Warangal) జిల్లాలకు చెందిన ఇన్ఛార్జి మంత్రులు, జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో మంత్రి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. మొదటి విడతలో మంజూరైన ఇళ్లలో చాలా మంది నిర్మాణం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. 3 లక్షలకు పైగా ఇండ్లను మంజూరు చేయగా దాదాపు 2.90 లక్షల వరకు గ్రౌండింగ్ అయ్యాయని వెల్లడించారు. సుమారు 50 వేల గృహ ప్రవేశాలు కూడా జరిగాయన్నారు.
Indiramma Houses | జూన్ 2న రెండో విడత
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ఆదిలాబాద్లో రెండో విడత ఇళ్ల మంజూరు కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. అర్హులైన పేదలందరికీ ఇళ్లు వచ్చే వరకు విడతల వారిగా ఇందిరమ్మ ఇళ్ల పథకం కొనసాగుతుందని చెప్పారు.
Indiramma Houses | వారికి గుడ్న్యూస్
ఉమ్మడి రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రూ.20 వేల వరకు ప్రభుత్వం నుంచి సహాయం పొందిన వారికి కూడా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని మంత్రి తెలిపారు. ఇందిరమ్మ పైలట్ గ్రామాల్లో 600కు పైగా చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇళ్లను నిర్మించిన వారి బిల్లులను క్లియర్ చేయాలని అధికారులను ఆదేశించారు. కాగా గతంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద లబ్ధి పొందిన వారికి ఇళ్లు ఇవ్వమని ప్రభుత్వం పేర్కొంది. అయితే ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ఆర్ (YSR) హయాంలో చాలా మంది ఇళ్లు కట్టుకోకున్న బిల్లులు లేపుకున్నారు. అలాంటి వారు ప్రస్తుతం తమకు ఇల్లు రాదని ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వం గతంలో లబ్ధి పొందిన వారికి కూడా ఇల్లు ఇస్తామని ప్రకటించడం గమనార్హం.
Indiramma Houses | మట్టి తరలిస్తే అడ్డు చెప్పొద్దు
ఇందిరమ్మ ఇళ్ల బేస్మెంట్ కోసం చెరువులు, కుంటల నుంచి మట్టిని తరలిస్తే రెవెన్యూ, పోలీసు శాఖ అధికారులు అడ్డు చెప్పకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను మంత్రి ఆదేశించారు. కాగా ప్రస్తుతం ఇసుక, మట్టి రవాణాపై పోలీసులు, అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఫలితంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇసుక, మట్టి దొరకడం లేదు. పోలీసుల నిఘా పెరగడంతో కొందరు అధిక ధరకు విక్రయిస్తున్నారు. ఫలితంగా లబ్ధిదారులపై భారం పడుతోంది. ఈ క్రమంలో మంత్రి ఆదేశాలు ఇవ్వడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇసుక విషయంలో సైతం సూచనలు చేయాలని కోరుతున్నారు.
దీనిని కూడా చదవండి : Ministers Convoy Tour|మంత్రుల భారీ కాన్వాయ్.. ఇంధన ఆదా సూత్రాలు సామాన్యులకేనా అంటూ విమర్శలు


