అక్షరటుడే, కామారెడ్డి: Indiramma Houses | ఇందిరమ్మ ఇళ్ల ప్రగతిలో రాష్ట్రంలోనే కామారెడ్డి(Kamareddy) జిల్లా నాల్గో స్థానంలో ఉందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) తెలిపారు. ఈ మేరకు శనివారం సాయంత్రం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
Indiramma Houses | మొత్తం 12,090 ఇళ్లు..
జిల్లాలో మొత్తం 12,090 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయగా, గ్రౌండింగ్ విషయంలో 10,945 ఇళ్లకు పనులు పూర్తి చేసి 90.52శాతం ప్రగతితో రాష్ట్రంలోనే 2వ స్థానంలో నిలిచిందన్నారు. గ్రౌండింగ్ పూర్తయిన ఇళ్లలో ఇప్పటివరకు 6,077 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని, పూర్తయిన ఇళ్ల విభాగంలో జిల్లా 8వ స్థానం దక్కించుకుందని తెలిపారు. లబ్ధిదారులకు ఇప్పటికే రూ.238.77 కోట్లు విడుదల చేయగా, చెల్లింపుల్లోనూ జిల్లా 8వ స్థానంలో ఉందన్నారు. అంతేకాకుండా గృహ నిర్మాణాలకు ఆర్థిక సహకారం కోసం 2,365 మంది లబ్ధిదారులకు స్వయం సహాయక సంఘాల ద్వారా రూ.31.97 కోట్లు రుణాలుగా అందజేశామని, మరింత మందికి బ్యాంకుల సహకారంతో రుణ సదుపాయం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల ఫేజ్-2 అమలుకు జిల్లా యంత్రాంగం ముందస్తు సన్నాహాలు చేపట్టిందన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి గృహ సౌకర్యం కల్పించాలనే ప్రభుత్వ లక్ష్య సాధనకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు. నిర్మాణంలో ఉన్న ఇళ్లను నిర్దేశిత గడువులో పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో కామారెడ్డి జిల్లా రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు.