అక్షరటుడే, వెబ్డెస్క్: JP Nadda CPM Leaders | సీపీఎం నేతలపై కేంద్ర మంత్రి జేపీ నడ్డా బుధవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ (Delhi)లోని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) కార్యాలయంపై మంగళవారం పోలీసులు జరిపిన దాడిని ‘సాధారణ శాంతిభద్రతల పరిస్థితి’గా ఆయన అభివర్ణించారు. ఈ పోలీసు చర్యను రాజకీయం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజ్యసభలో బుధవారం పార్టీ కార్యాలయంపై జరిగిన పోలీసుల దాడి అంశాన్ని సీపీఎం రాజ్యసభ ఎంపీ జాన్ బ్రిట్టాస్ ప్రస్తావించారు. ఒక పాత కేసులో సీపీఎం విద్యార్థి విభాగం ఎస్ఎఫ్ఐ ఢిల్లీ కార్యదర్శి, జేఎన్యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షురాలు ఐషే ఘోష్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు యత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు, సీపీఎం నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు ఐషే ఘోష్ను అరెస్ట్ చేయకుండానే వెనుదిరిగారు. దీనిపై సీపీఎం నేతలు సభలో ప్రస్తావించగా.. నడ్డా స్పందించారు.
JP Nadda CPM Leaders | నన్ను అరెస్ట్ చేశారు
ఇది చాలా సాధారణ శాంతిభద్రతల పరిస్థితి అని జేపీ నడ్డా పేర్కొన్నారు. క్రియాశీలతలో ఉన్న ఏ విద్యార్థి నాయకులు అయినా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తుందన్నారు. తాను కూడా విద్యార్థి కార్యకర్తగా ఉన్నప్పుడు పలుమార్లు అరెస్టు అయిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. శాంతిభద్రతల పరిస్థితిని బట్టి పోలీసులు వ్యవహరించారు అని తెలిపారు. ప్రతిపక్షాలు దీనిని రాజకీయం చేయకూడదని నడ్డా స్పష్టం చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద ఇటీవల జరిగిన విద్యార్థి నిరసనలో ఘోష్ పాల్గొనడంతోనే పోలీసుల చర్య ముడిపడి ఉందని సీపీఎం నాయకులు ఆరోపించారు. ఇటీవలి నిరసనలలో పాల్గొన్నందుకు ఒక విద్యార్థి నాయకురాలిపై చర్య తీసుకోవడానికి పోలీసులు పాత కేసును వాడుకుంటున్నారని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి..: BHIM UPI Growth | యూపీఐ యాప్స్లో దూసుకెళ్తున్న ‘భీమ్’.. రెండేళ్లలో పది రెట్లు పెరిగిన లావాదేవీలు