అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Junior College | జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం (State Government) వెంటనే రూ.5 కోట్ల ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని విద్యార్థి సేన జిల్లా అధ్యక్షుడు వినయ్ కుమార్ డిమాండ్ చేశారు.
విద్యార్థి సేన ఆధ్వర్యంలో శనివారం జరిగిన జిల్లాస్థాయి సమావేశంలో ఈ తీర్మానం చేశారు. జిల్లా అధ్యక్షుడు వినయ్ కుమార్ మాట్లాడుతూ సుమారు 900 మంది విద్యార్థులు చదువుతున్న కళాశాలలో కనీస మౌలిక వసతులు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. సరిపడా తరగతి గదులు, బెంచీలు లేకపోవడంతో విద్యార్థులు నేలపై కూర్చుని చదువుకోవాల్సి వస్తోందని తెలిపారు.
Kamareddy Junior College | అధ్యాపకుల కొరత..

అధ్యాపకుల కొరత, తాగునీటి సౌకర్యం లేకపోవడం, మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉండటం వంటి సమస్యలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తామని చెబుతున్న ప్రభుత్వం జిల్లా కేంద్రంలోని ప్రధాన కళాశాల పరిస్థితిని పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు. వెంటనే స్పందించి అన్ని సమస్యలను పరిష్కరించి విద్యార్థులకు నాణ్యమైన విద్యా వాతావరణం కల్పించాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ప్రత్యేక చొరవ తీసుకుని కళాశాల సమగ్ర అభివృద్ధికి రూ.5 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఆ నిధులతో కొత్త తరగతి గదులు, బెంచీలు, ఫర్నిచర్, తాగునీటి వసతి, మరుగుదొడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి కామారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలను రాష్ట్రంలోనే ఆదర్శ కళాశాలగా తీర్చిద్దాలని కోరారు. ఈ సమావేశంలో శ్రీకాంత్, చందు, పాషా, ప్రవీణ్, నోమన్, ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Kamareddy Damaged Bridges | భారీ వానొస్తే ఆగమే..! దెబ్బతిన్న వంతెనలకు మరమ్మతులు కరువు..