అక్షరటుడే, లింగంపేట: Madan Mohan Rao | కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే మదన్మోహన్ (madan mohan rao) అన్నారు. ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గ ప్రజల కోరిక మేరకు రోడ్డు నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభింపజేస్తామని తెలిపారు. లింగంపేట (lingampet) మండలంలోని లింగంపల్లి గ్రామ సమీపంలో గల అమృత కన్వెన్షన్లో ఆదివారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు.
Madan Mohan Rao | కేకేవై రహదారి కోసం పక్కా ప్రణాళిక..
ఎల్లారెడ్డి నియోజకవర్గ (Yellareddy Constituency) ప్రజల చిరకాల కోరిక కరీంనగర్ – కామారెడ్డి – ఎల్లారెడ్డి కేకేవై రోడ్డు నిర్మాణానికి త్వరలోనే ప్రణాళికలు వేస్తామని నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన నివేదిక కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వద్ద ఉందని తెలిపారు. ఆయనతో మాట్లాడి త్వరలోనే రోడ్డు నిర్మాణానికి అనుమతిని తీసుకొస్తానన్నారు. కాళేశ్వరం ప్యాకేజీ 22 ద్వారా కాటేవాడి, మోతే, ధర్మరావుపేట, గుర్జిల్, ప్రాంతాల్లో మినీ ప్రాజెక్టులు నిర్మాణం చేపట్టి రైతులకు సాగునీరు అందిస్తామన్నారు. రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో మినీ ప్రాజెక్టుల నిర్మాణం గురించి చర్చించడం జరిగిందన్నారు. నియోజకవర్గ సమస్యల గురించి అసెంబ్లీలో మాట్లాడుతున్నానని అధికారుల చుట్టూ అభివృద్ధి కోసం తిరుగుతున్నానని చెప్పారు.
Madan Mohan Rao | పదేళ్లలో పేదవాళ్లకు ఒక్క ఇల్లు కట్టారా..?
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క పేదవాడికైనా ఇల్లు కట్టించిన దాఖలాలు ఉన్నాయా అని ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకులను ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా నియోజకవర్గానికి 3,670 ఇందిరమ్మ గృహాలు (Indiramma Homes) మంజూరు చేసిందని వివరించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయన్నారు. పార్టీలకు అతీతంగా అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. నియోజకవర్గంలో రూ.80 కోట్లతో సీసీ రోడ్లు నిర్మించడం జరిగిందని తెలిపారు. 134 మహిళా సంఘాల భవనాలకు శ్రీకారం చుట్టామన్నారు. నియోజకవర్గంలోని ఆయా మండలాల మహిళా సంఘాలకు రూ.కోటికి పైగా రుణాలు అందజేశామని చెప్పారు.
Madan Mohan Rao | ప్రతి గ్రామంలో ప్లాస్టిక్ నిషేధానికి తీర్మానం చేయాలి
ప్రతి గ్రామంలో ప్లాస్టిక్ నిషేధానికి తీర్మానం చేయాలని ఎమ్మెల్యే మదన్మోహన్ సూచించారు. ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఐస్ క్రీములు సైతం విక్రయించరాదని తీర్మానం చేయాలన్నారు. అంగన్వాడీ ఆధ్వర్యంలో చిన్నారులు వేదికపై రావడంతో వారిని అభినందించారు. అనంతరం పలువురికి కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఆర్డీవో ప్రభాకర్, డీఆర్డీవో పీడీ సురేందర్, డీఎస్పీ శ్రీనివాస్, ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ ఛైర్మన్ రజిత వెంకటరమణా రెడ్డి, లింగంపల్లి సర్పంచ్ ప్రత్యూష సాయిరాం గోకుల్, లింగంపేట, ఎల్లారెడ్డి తహశీల్దార్లు సురేష్, ప్రేమ్ కుమార్, ఆత్మ కమిటీ ఛైర్మన్ దశరథ్ నాయక్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బుర్ర నారాగౌడ్, మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ రాజు, లింగంపేట్ సర్పంచ్ కౌడ రవీందర్, ఆయా శాఖలకు చెందిన అధికారులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి : CV Anand DGP| అమ్మ కోరిక తీర్చిన కొడుకు..సీవీ ఆనంద్ ఎమోషనల్ పోస్ట్!

