అక్షరటుడే వెబ్డెస్క్: Bandi Sanjay | హైదరాబాద్లోని చెరువుల ఆక్రమణలు, హైడ్రా కూల్చివేతలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముఖ్యంగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి చెందిన విద్యాసంస్థల ఆక్రమణల అంశాన్ని ప్రస్తావిస్తూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
Bandi Sanjay | ప్రభుత్వంపై విమర్శలు..
“ప్రపంచమంతా ఒవైసీ కళాశాల చెరువులోనే ఉందని చూస్తుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అది చెరువులో లేదని నమ్మించే ప్రయత్నం చేస్తోంది” అని బండి సంజయ్ విమర్శించారు. పేదల ఇళ్లపై బుల్డోజర్లు నడిపే ప్రభుత్వానికి, ఒవైసీ ఆక్రమణలు ఎందుకు కనిపించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఇది ప్రభుత్వం ‘కంటి చూపు’ సమస్యనా? లేక ‘రాజకీయ సంకల్పం’ లోపించడమా? అని నిలదీశారు.
Bandi Sanjay | బీజేపీ కార్యకర్తలకు కొత్త పిలుపు..
ఈ వ్యవహారంపై బీజేపీ ( BJP )శ్రేణులకు బండి సంజయ్ ఒక వినూత్న పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకుల కోసం ప్రతి బీజేపీ కార్యకర్త ‘ఉచిత నేత్ర పరీక్షల’ శిబిరాలు నిర్వహించాలని సూచించారు. “నేత్ర పరీక్షల తర్వాత కూడా వారికి ఆ ఆక్రమణ కనిపించకపోతే.. సమస్య కంటిలో లేదు, వారి రాజకీయాల్లోనే ఉందనేది స్పష్టమవుతుంది” అని ఆయన ఎద్దేవా చేశారు.
Bandi Sanjay | ద్వంద్వ వైఖరిపై ఆగ్రహం..
చెరువుల పరిరక్షణలో కాంగ్రెస్ ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని ఆయన ఆరోపించారు. రాజకీయ అవసరాలకు అనుగుణంగానే ఎఫ్టీఎల్ (FTL) గీతలను మారుస్తున్నారనే అనుమానాలు ప్రజల్లో ఉన్నాయని బండి సంజయ్ పేర్కొన్నారు. పేదలకు ఒక న్యాయం.. అధికార పార్టీకి, వారి మిత్రపక్షాలకు మరో న్యాయమా? అని ఆయన ప్రశ్నించారు. చట్టం అందరికీ సమానమని, సెలెక్టివ్గా కూల్చివేతలు చేయడం సరికాదని ఆయన హితవు పలికారు. ప్రభుత్వం ఇప్పటికైనా తన ద్వంద్వ వైఖరిని వీడి, అందరికీ కనిపిస్తున్న ఆక్రమణలను ఎందుకు చూడటం లేదో స్పష్టమైన సమాధానం చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: Sheikh Hasina Return | అరెస్ట్ చేసినా.. చంపేసినా సరే స్వదేశానికి వెళ్తా: షేక్ హసీనా