అక్షరటుడే వెబ్డెస్క: తెలంగాణ రాజకీయాల్లో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ స్థాపించబోతున్నారనే ప్రచారంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి కేసీఆర్తో ఏర్పడిన రాజకీయ విభేదాల వల్లే కవిత ఈ దిశగా అడుగులు వేస్తున్నారని ఆయన విశ్లేషించారు. గతంలో ఆమె ముఖ్యమంత్రి పీఠాన్ని ఆశించినప్పటికీ, కేసీఆర్ అందుకు అంగీకరించకపోవడమే ప్రస్తుతం తండ్రీకూతుళ్ల మధ్య దూరం పెరగడానికి కారణమని పాల్ పేర్కొన్నారు. ఈ కొత్త పార్టీ ఏర్పాటు ప్రజల కోసం కాదని, కేవలం తన వ్యక్తిగత ఆస్తుల రక్షణ కోసమేనని ఆయన విమర్శించారు.
Kavitha New Party |2008 నాటి రూ.10 కోట్ల ఉదంతం..
ఈ సందర్భంగా పాల్ గతంలోని ఒక సంఘటనను గుర్తు చేసుకున్నారు. “2008లో కవిత నా దగ్గరకు వచ్చి పార్టీ అవసరాల కోసం 10 కోట్ల రూపాయల నిధులు అడిగారు. నేను 15 కోట్లు ఇవ్వాలని భావించినప్పటికీ.. కవితకు ఒక్క రూపాయి కూడా ఇవ్వవద్దని స్వయంగా కేసీఆరే నన్ను కోరారు. అందుకే ఆ రోజు నేను వెనక్కి తగ్గాను” అని పాల్ వెల్లడించారు. తాను అమెరికా పర్యటనల్లో బిజీగా ఉండటం వల్ల కొన్నాళ్లుగా తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై దృష్టి పెట్టలేకపోయానని ఆయన వివరించారు.
Kavitha New Party |ట్రంప్తో చర్చలు.. యుద్ధ నివారణే లక్ష్యం..
అంతర్జాతీయ అంశాల గురించి మాట్లాడుతూ.. అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని తగ్గించేందుకు తాను ప్రయత్నిస్తున్నట్లు పాల్ తెలిపారు. ఈ ఉద్రిక్తతలు కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది ప్రజలు ఇబ్బందుల్లో పడతారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై చర్చించేందుకు తాను అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో సంప్రదింపులు జరుపుతున్నానని, పలు దేశాల ప్రతినిధులు తన సలహాలను పాటిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
Kavitha New Party |ప్రజాశాంతి పార్టీలోకి ఆహ్వానం..
తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి పథంలో నడిపించే సత్తా తనకు ఉందని, భారీ స్థాయిలో నిధులు తీసుకురాగలనని పాల్ ధీమా వ్యక్తం చేశారు. కులమతాలకు అతీతంగా, అభివృద్ధిని కోరుకునే మేధావులు, సామాన్యులందరూ ప్రజాశాంతి పార్టీలో చేరాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
ఇది కూడా చదవండి: Hyderabad Chit Fund Scam | చిట్టీల పేరుతో మరో భారీ మోసం.. కేటుగాళ్లపై బాధితుల ఫిర్యాదు!

